జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్ళ రాదన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు కనీసం ప్రతి ఒక్కరూ ఐదు లీటర్ల మంచినీటిని తాగాలని సూచించారు.
కాఫీలు, టీలను ఎక్కువ వేడి సమయంలో తాగరాదని, మజ్జిగ, కొబ్బరి బోండాలు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని తెలిపారు. చిన్నారులు ఎండలో ఆడుకోవడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని కనిపెట్టుకొని ఉండాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వారి శరీరాన్ని చల్లటి తడిగుడ్డతో శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చేవరకు తుడుస్తూ ఉండాలన్నారు. వడదెబ్బకు గురైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని పేర్కొన్నారు.