మంత్రి ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టాలి : దాసోజు శ్రవణ్

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ - Dasoju Shravan said that a case of attempted murder should be filed against Minister Errabelli

Update: 2022-08-15 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రలో టీఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తూ, దాడికి ప్రోత్సహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై హత్యాయత్నం కేసు పెట్టాలని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ గుండాలు కర్రలతో, రాళ్లతో చేసిన దాడిని ఆయన ఖండించారు. ఇది టీఆర్ఎస్ నేతల అహంకార, అరాచక వైఖరికి నిదర్శనమని, వారి రాక్షస ప్రవృత్తికి ప్రతీక అని విమర్శలు చేశారు. బండి సంజయ్ పాదయాత్రకు, బీజేపీ కి పెరుగుతున్న జనాదరణ చూసి తట్టుకోలేక హింసకు పాల్పడుతున్నారన్నారు. ప్రత్యక్ష్యంగా దాడికి పాల్పడిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన మంత్రి ఎర్రబెల్లి పై కూడా హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దాడి జరగక ముందే మంత్రి ఎర్రబెల్లి ప్రెస్ మీట్ పెట్టి మరీ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటామని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, కుట్రపూరితంగా ఈ దాడికి పాల్పడ్డారన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాక్షస దాడికి పాల్పడటం, కేసీఆర్ పిరికితనానికి నిదర్శనమన్నారు. ఈ దుశ్చర్య టీఆర్ఎస్ పతనానికి నాంది అని, నాయకుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. భవిష్యత్తులో వారి ఓటమి వారి కళ్ల ముందు కదలాడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడులు చేసి బీజేపీ ని బెదిరించాలనుకుంటే అది టీఆర్ఎస్ నాయకుల మూర్ఖత్వమేనని దాసోజు ఫైరయ్యారు. కంచే చేను మేసినట్లు, తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్‌కు గులాములుగా మారారని విమర్శలు చేశారు. ఈ దాడి గురించి ముందే వారికి తెలిసినప్పటికీ, సరైన భద్రత కల్పించకుండా వారి వృత్తిని కించపరుస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్ర సాఫీగా కొనసాగేలా పూర్తి రక్షణ కల్పించాలని డీజీపీకి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీ నేతలపై దాడి.. బీజేపీ నేత రచనా రెడ్డి

Similar News