ఎమర్జెన్సీ మీటింగ్ వెనక భారీ వ్యూహం.. T-బీజేపీ నేతలకు అమిత్ షా కీలక మెసేజ్!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకు వెళ్లాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.

Update: 2023-04-23 16:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకు వెళ్లాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏది ఏమైనా సరే.. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ ముఖ్య నాయకులతో అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌లో లేకపోయినా స్పెషల్ మీటింగ్ నిర్వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కావాల్సి ఉంది. కానీ కర్ణాటక ఎన్నికలు, ఇతర ముఖ్య పనుల కారణంగా ఆ షెడ్యూల్‌ను మార్చారు. శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల సభకే షా హాజరవుతారని ప్రకటించారు. కానీ ఉన్నపళంగా ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించడంతో పెద్ద స్కెచ్‌ ఉందని వినిపిస్తోంది.

కాగా ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమై పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాకుండా బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న తాజా వివాదాలపైనా చర్చ జరిగినట్లు వినికిడి. ఇదిలా ఉండగా దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తాను ప్రతినెలా తెలంగాణకు వస్తానని ముఖ్య నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు సైతం తరచూ వస్తారని సమాచారం. ఎన్నికలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో పూర్తి యాక్షన్ లోకి దిగాలని ముఖ్య నేతలతో సమావేశంలో అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.

కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చే నెల నుంచి తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచాలని, పార్టీ కార్యకర్తలను కూడా అందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించినట్లు వినికిడి. ముఖ్యమంత్రితో కొట్లాటకు దిగుతారో? ప్రజలకు చేరువవుతారనేది రాష్ట్ర నేతలకు వదిలేస్తున్నానని, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని, ఏం చేసినా సరే తెలంగాణలో అధికారంలోకి వచ్చి కాషాయ జెండాను రెపరెపలాడించాల్సిన బాధ్యత తెలంగాణ నేతలపై ఉందని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశం అనంతరం ఇటీవల బీజేపీలో చేరిన నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బండి సంజయ్.. కేంద్ర మంత్రి అమిత్ షాకు పరిచయం చేశారు.

Tags:    

Similar News