ఆర్టీసీ డ్రైవర్ మృతిపై.. ఎండీ క్లారిటీ

వికారాబాద్‌ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టీ రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

Update: 2024-04-30 15:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్‌ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టీ రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదని ఆయన మంగళవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోందన్నారు. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్‌ అయ్యారన్నారు. 2018 నుంచి శ్రామిక్‌ గా డిపోలో పనిచేస్తున్నట్లు తెలిపారు.

గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజప్ప 12 రోజులు విధులకు గైర్హాజరయ్యారని గుర్తు చేశారు. అయినా ఆయనకు డ్యూటీని కేటాయించినట్లు తెలిపారు. గత మూడు రోజులు నుంచి కూడా విధులకు హాజరు కావడం కాలేదని క్లారిటీ ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలోని తన స్వగ్రామం దౌలపూర్‌లో సోమవారం రాత్రి రాజప్ప ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిందన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాజప్ప మృతికి సంస్థ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోందన్నారు. రాజప్ప ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని తెలుస్తోందన్నారు. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానికి సంస్థ అధికారులు బాధ్యులని ఆరోపించడం సరైంది కాదన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని తెలిపారు.


Similar News