మోడీపై విరుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ వెళ్ళిపోయింది. ఏప్రిల్ 19 నుంచి కొత్త మార్పులు వచ్చాయని అన్నారు. మా మేనిఫెస్టోపై నిరంతరం విమర్శలు చేస్తున్న మోడీ ఏప్రిల్ 5-19 మధ్య కాంగ్రెస్ మేనిఫెస్టోను పట్టించుకోలేదని, కానీ ఏప్రిల్ 19న జరిగిన మొదటి దశ ఎన్నికల తర్వాత మేనిఫెస్టో కొత్త స్థాయిని సంతరించుకుందని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ మార్పులు చేసింది. మోదీ సర్కార్ పోయింది. కొద్దిరోజులుగా బీజేపీ సర్కార్.. నిన్నటి నుంచి ఎన్డీయే సర్కార్ అయింది..ఈ అనూహ్య మార్పును గమనించారా? అని చిదంబరం ఎక్స్లో ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల మంగళ సూత్రాలకు ముప్పు వాటిల్లుతుందని ఇటీవల బీజేపీ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న బీజేపీ వాదనలపై చిదంబరం మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఎక్కడ ఉంది.. గత నాలుగు రోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలన్నీ పూర్తిగా ఊహాజనితమైనవే.. వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.. అది ఎక్కడ ఉందో చూపించాలి. నేను వారికి బహిరంగంగా సవాల్ విసురుతున్నానని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోను "కల్ట్ ఆరాధన"గా చిదంబరం అభివర్ణించారు.