24ఫ్రేమ్స్: సినిమాలు ఖరీదుగా ఎందుకు మారాయి?

మన దేశంలో సామాన్యుడి వినోదం సినిమానే. తెరపై బొమ్మలు కదలడం, మాట్లాడడం, పాడడం, నాట్యం చేయడం మొదలయ్యాక సినిమా సామాన్యుడి

Update: 2022-10-07 19:15 GMT

ఇవ్వాళ 'మల్టీప్లెక్స్' సినిమా హాళ్లలో ఒక కుటుంబం అంతా కలిసి సినిమా చూడాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ రోజు సినిమా ఒక ఖరీదైన వినోదంగా మారిపోయింది. దీంతో సామాన్య ప్రేక్షకులు సినిమాలకు, సినిమా హాళ్లకు దూరమైపోయారు. 'ఓ నెలో, రెండు నెలలో ఆగితే ఓటీటీలలో చూడొచ్చులే' అనే భావన ప్రేక్షకులలో క్రమంగా నెలకొంటున్నది. పర్యవసానంగా సినిమా హాళ్లకు వచ్చే జనం తగ్గిపోయి అవి బోసిపోతున్నాయి. 'జనం సినిమాలకు రావడం లేదు మొర్రో' అని సినిమా వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రేక్షకులను టాకీసుల దాకా రాబట్టడానికి కొత్త ఎత్తులు వేయడం, పాన్ ఇండియా అని కబుర్లు చెప్పడం షురూ చేసారు. 'ప్రేక్షక దేవుళ్లు' అనే మాట మరిచిపోయి ప్రేక్షకులను వినియోగదారులుగా చూడడం ఆరంభించారు.

న దేశంలో సామాన్యుడి వినోదం సినిమానే. తెరపై బొమ్మలు కదలడం, మాట్లాడడం, పాడడం, నాట్యం చేయడం మొదలయ్యాక సినిమా సామాన్యుడి జీవితంలో అంతర్భాగమైపోయింది. పండగొచ్చినా, పబ్బమొచ్చినా, దోస్తులు కలిసినా, చుట్టాలొచ్చినా అంతా కలిసి సినిమాకు వెళ్లడం భారతీయులకు సాధారణం కాలక్షేపం. కదిలే బొమ్మల కబుర్లు చెప్పుకోవడం, వాటి గురించి మాట్లాడుకోవడం ఎంతో సరదా. ఈ శతాబ్ద కాలంలో ముంబై లాంటి మహా నగరాల నుంచి మారుమూల పల్లెల దాకా సినిమా ప్రజలలోకి చొచ్చుకుపోయింది.

అంతకుముందు వీధి నాటకాలూ, హరికథలూ, బుర్రకథలూ, ఒగ్గు కథలలాంటి కళా రూపాలలో రామాయణ, భారత కథలను చూసి ఆనందించి, వినోదాన్ని చూసిన సామాన్య ప్రజానీకానికి సినిమా అద్భుత వినోద వ్యాపకంలా మారిపోయింది. అవి వారికి అందుబాటు ధరలోనే వినోదాన్ని పంచాయి. రోజంతా కాయకష్టం చేసిన వారికి సినిమా పెద్ద వేదిక అయిపోయింది. కానీ, ప్రదర్శనా రంగంలో ఇవ్వాళ 'మల్టీప్లెక్స్' సినిమాహాళ్ల సంస్కృతి వచ్చి సామాన్యుడిని సినిమాలకు దూరం చేసింది.

క్రమక్రమంగా మారుతూ

గతంలో నా ఎరుకలోనే 35 పైసలకు నేల టికెట్ మీద సినిమా చూసిన జ్ఞాపకం. అప్పుడు బెంచి 75 పైసలు, కుర్చీ రూ.1.25 గా ఉండేది. కాలక్రమంలో కొంచెం కొంచెం పెరిగినా సామాన్యుడికి భారం కానీ స్థాయిలోనే ఉండేది. సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో 800 నుంచి 1000 సీట్లదాకా ఉండేవి. అందులో లోయర్ క్లాస్ ఎక్కువగా, హయ్యర్ క్లాస్ సీట్లు తక్కువగా ఉండేవి. అప్పుడు ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లగలిగేవారు. ఒకే సినిమాను రిపీటెడ్‌గా చూసేవాళ్లు. ఈలలు వేసి, గోల చేసేవాళ్లు. సినిమాలను వంద రోజులు, సిల్వర్ జూబిలీ. గోల్డెన్ జూబిలీ చేసేవాళ్లు.

సామాన్య ప్రేక్షకులలోనే హీరోలకు అభిమాన సంఘాలు ఉండేవి. టాకీసుల ముందు బ్యానర్లు కట్టి, పూలదండలు వేసి పండుగ చేసుకునేవాళ్లు. కేవలం వినోదం పేర సినిమాలకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యే వాళ్లు. ఇవ్వాళ ఈ దృశ్యాలు మనకు కనిపించవు. ఇప్పుడు సినిమావాళ్లే విపరీతంగా డబ్బులు పెట్టి ప్రచారం చేసుకుని, డబ్బా కొట్టుకునే స్థితి వచ్చింది. దాంతో సామాన్యుడికి సినిమాకు ఉన్న కనెక్టివిటీ పోయింది. సినిమా పరాయిదైపోయింది.

కుటుంబమంతా చూడాలంటే

ఇవ్వాళ 'మల్టీప్లెక్స్' సినిమా హాళ్లలో ఒక కుటుంబం అంతా కలిసి సినిమా చూడాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ రోజు సినిమా ఒక ఖరీదైన వినోదంగా మారిపోయింది. దీంతో సామాన్య ప్రేక్షకులు సినిమాలకు, సినిమా హాళ్లకు దూరమైపోయారు. 'ఓ నెలో, రెండు నెలలో ఆగితే ఓటీటీలలో చూడొచ్చులే' అనే భావన ప్రేక్షకులలో క్రమంగా నెలకొంటున్నది. పర్యవసానంగా సినిమా హాళ్లకు వచ్చే జనం తగ్గిపోయి అవి బోసిపోతున్నాయి. 'జనం సినిమాలకు రావడం లేదు మొర్రో' అని సినిమా వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రేక్షకులను టాకీసుల దాకా రాబట్టడానికి కొత్త ఎత్తులు వేయడం, పాన్ ఇండియా అని కబుర్లు చెప్పడం షురూ చేసారు.

'ప్రేక్షక దేవుళ్లు' అనే మాట మరిచిపోయి ప్రేక్షకులను వినియోగదారులుగా చూడడం ఆరంభించారు. ఫలితంగా వాళ్లు సినిమా నిర్మాణం నుండి విడుదల దాకా అష్ట కష్టాలు పడాల్సి వస్తున్నది. తీరా ఏదో ఒకరకంగా సినిమాలను టాకీసు దాకా తెస్తే అవి ఆర్థికంగా ఏమవుతాయో తెలియని స్థితి ఏర్పడింది. సామాన్యుడి వినోదాన్ని హంగుల పేర దూరం చేసి తిరిగి వాళ్లనే దోషులుగా చూపడం సినిమా వాళ్లకు అలవాటైపోయింది.

అసలు కారణం అదే

అసలీ మార్పు 90లలోనే మొదలైంది. దీనికి అప్పుడు దేశంలో అమలులోకి వచ్చిన ఎల్‌పీజీ ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. గ్లోబలైజేషన్ ప్రభావం సినిమా రంగం పైన పెద్ద ఎత్తున పడింది. అప్పుడే సినిమాకు పరిశ్రమ హోదా ఇచ్చారు. చిన్న నిర్మాతల స్థానంలో కార్పొరేట్ సంస్థలు నిర్మాణ, పంపిణీ, ప్రదర్శనా రంగాలలోకి వచ్చాయి. పాశ్చాత్య సంస్కృతి పెచ్చరిల్లింది. ఆధునిక సాంకేతికత ఆవిర్భావంతో సీన్ మొత్తం మారిపోయింది. తొలుత సినిమా హాళ్లలో కింది టికెట్ల సీట్లు తగ్గించేసారు. పెద్ద రేట్ల సీట్లు పెంచారు. అక్కడితో ఆగకుండా అసలు ఈ సింగిల్ స్క్రీన్ అనవసరం అన్నారు. వాటి స్థానంలో 'మల్టీ ప్లెక్స్' ఆలోచన మొదలయింది. హాళ్లలో సీట్లను 200కు పరిమితం చేసి ఓ వ్యాపార కూటమిగా ఏర్పరిచారు.

1990లలో ముంబైలో మొట్టమొదటి పీవీఆర్ అనుపమ మల్టిపుల్ సినిమా హాలు మొదలైది. 2002లో 'ఫేం సినిమా' మొదటి 'మల్టీ ప్లెక్స్‌'గా పేరొందింది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్, కాఫీ హౌజ్, పాప్‌కార్న్ టబ్స్, గేమింగ్ మొదలైనవన్నీ సమకూర్చడం మొదలు పెట్టారు. అన్నీ ఖరీదైనవి కావడంతో ప్రేక్షకుల పైన భారం విపరీతంగా పెరిగింది. మహానగరాల నుంచి మామూలు పట్టణాల వరకు 'మల్టీ ప్లెక్స్' సంస్కృతి పెరిగిపోయింది. పీవీఆర్, ఐనాక్స్, బిగ్ సినిమా, సినిపోలిస్, ముక్తా లాంటి బడా సంస్థలు 'మల్టీప్లెక్స్' రంగాన్ని శాసిస్తున్నాయి. ఈ స్థితిలో సామాన్యుడు సినిమా హాలుకు రావడం గగనం అయిపోయింది. కలెక్షన్లు కూలిపోయి సినిమాలు తిరుగు టపాలో వెనుదిరుగుతున్నాయి.

మళ్లీ మొదటికి

ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే సినిమా వాళ్లు గమనిస్తున్నట్టున్నది. ఉదాహరణకు 'బచ్చన్ బ్యాక్ టు ది బిగినింగ్' గురించి చెప్పాలి. అమితాబ్ బచ్చన్‌కి 80 ఏళ్లు నిండిన సందర్భంగా పీవీఆర్ సినిమాస్, ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నెల 8 నుంచి 11 వరకు నాలుగు రోజుల ఉత్సవాలను నిర్వహిస్తున్నది. దేశంలోని 17 నగరాలలోని 22 సినిమా హాళ్లలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. సినిమాలు ప్రదర్శించే ఈ నాలుగు రోజులకు గాను 'మల్టీప్లెక్స్' రేట్లు కాకుండా రూ. 400 మాత్రమే చార్జ్ చేస్తారు.

ముంబై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాలతో పాటు సూరత్ బరోడా లాంటి నగరాలలోనూ కూడా ఈ సినిమాలు ప్రదర్శిస్తారు. వీటిలో డాన్, కభీ కభీ, నమక్ హలాల్, అభిమాన్, కాలా పత్తర్, కాలియా, అమర్-అక్బర్-ఆంథోనీ, దీవార్, మిలీ, సత్తే పే సత్తా, చుప్ కే చుప్ కే లాంటి సినిమాలను ప్రదర్శిస్తారు. 'మల్టీ ప్లెక్స్ ప్రదర్శనలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఇది. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో 'మల్టీప్లెక్స్' ఆలోచన మారే అవకాశం వుంది. తెలుగు సినిమా కూడా ఆలోచించాల్సి రావచ్చు.


వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News