జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన సంజీవ్!

దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-04-28 16:48 GMT

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతేడాది జెట్ ఎయిర్‌వేస్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంజీవ్ కపూర్ రాజీనామా చేసినట్లు జలాన్ కల్రాక్ కన్సార్టియం(జేకేసీ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. సంజీవ్ కపూర్ నోటీసు పీరియడ్ ముగిసిన నేపథ్యంలో మే 1 తర్వాత కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణకు జేకేసీ పూర్తిగా కట్టుబడి ఉంది. సంస్థ సీఈఓ పదవిని భర్తీ చేసే వరకు జేకేసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆ బాధ్యతలను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా మాట్లాడిన జేకేసీ బోర్డు సభ్యుడు అంకిత్ జలాన్, సంజీవ్ కపూర్ 2022, ఏప్రిల్‌లో జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా సీఈఓ బాధ్యతలు చేపట్టారు. సంస్థ వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ ఆయన సహకారం అందించినందుకు కృతజ్ఞతలు. జెట్ ఎయిర్‌వేస్ కొత్త సీఈఓను త్వరలో జేకేసీ ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News