విశాఖలో సీఐటీఎస్.. త్వరలో శిక్షణ
మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్టీఐ) పని చేస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు...
- రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్టీఐ) పని చేస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 33 ఎన్ఎస్టీఐలు వాటికి అనుబంధంగా మూడు కేంద్రాలు నెలకొల్పినట్లు రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇందులో 19 ఎన్ఎస్టీఐలు ప్రత్యేకంగా మహిళల కోసం నెలకొల్పినవేనని చెప్పారు. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ (హైదరాబాద్)లో మూడు ఎన్ఎస్టీఐలు నెలకొల్పగా, అందులో ఒకటి మహిళల కోసం ప్రత్యేకించిందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్టీఐ నెలకొల్పలేదని చెబుతూ విశాఖపట్నం గాజువాకలోని క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ట్రైనర్స్ (సీఐటీఎస్)ను అనుబంధ సంస్థగా ప్రకటించి 2022-23 నుంచి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి ట్రేడ్లలో శిక్షణను ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మూడు ట్రేడ్లలో 75 మందికి శిక్షణ పొందే అవకాశం ఉన్నట్లు కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.