వైసీపీ నేతలకు Nara Lokesh సవాల్

సీఎం వైఎస్ జగన్‌కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఛాలెంజ్ విసిరారు.

Update: 2022-12-06 06:14 GMT

దిశ, ఏపీ బ్యూరో : సీఎం వైఎస్ జగన్‌కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఛాలెంజ్ విసిరారు. ఈడీ విచారణ చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ నిధుల మళ్లింపు వ్యవహారంలో తనపై చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో ఆధారాలలతో సహా బయటపెట్టాలని సవాల్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపణలు చేసి పారిపోతున్నారని ప్రజల్ని మభ్య పెట్టడానికి తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. 'వైఎస్ జగన్‌తో పాటూ మిగిలిన వారికి విషయం చెప్పాలనుకుంటున్నాను.. మీరు అధికారంలోకి వచ్చి మూడు ఏళ్ల 8 నెలలు అవుతోంది. ఈ కాలంలో మీరు చెయ్యని విచారణ లేదు. మేము మీలానే అవినీతికి పాల్పడతామని అనుకోవడం అవివేకం అవుతుంది. గతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఐటీ కంపెనీలకు రాయితీలు, ఫైబర్ గ్రిడ్, ఇలా చాలా అంశాల్లో నాపై అవినీతి ఆరోపణలతో బురద జల్లారు.

మీరు చేసి ఆరోపణలో ఒక్కటి కూడా ఆధారాలు చూపలేక పారిపోయారు. ఆఖరికి చంద్రబాబుపై ఎంతో అల్లరి చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా కోర్టు కొట్టేసింది'అని గుర్తు చేశారు. 'ఇప్పుడు మళ్లీ అందరి దృష్టిని మరల్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి అంటూ నాపై ఆరోపణలు మొదలు పెట్టారు. ఇప్పుడు నాపై చేస్తున్న అన్ని ఆరోపణలను నిరూపించేందుకు 24 గంటల సమయం ఇస్తున్నా. స్కిల్ డెవలప్‌మెంట్ సహా నాపై చేసిన ఆరోపణల్లో ఆధారాలు బయటపెట్టాలి. మరి ఈ ఆరోపణలపై ఆధారాలు బయటపెడతారో లేదో వేచి చూద్దాం. ఏదైనా ఉంటే నాపై నేరుగా పోరాడాలి.. ఇలాంటి ఫేక్ ఆరోపణలు చేయకూడదు'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అయితే, ఏపీలో గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ ఫోకస్ చేసింది. 2014-19 మధ్య కాలంలో భారీ అక్రమాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది.హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఈరోజు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : దేవినేని అవినాశ్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు సీజ్

Tags:    

Similar News