AP Professional Forum: అమరావతిని చంపడమే జగన్ ధ్యేయం

అమరావతి చంపడమే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆరోపించారు...

Update: 2023-05-20 14:28 GMT

దిశ, ఏపీ బ్యూరో: అమరావతిని చంపడమే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆరోపించారు. అమరావతిలో ఇళ్లస్థలాల కోసం నిర్దేశించిన ఆర్3 జోన్ ఉండగా పారిశ్రామిక అభివృద్ధి కోసం నిర్దేశించిన ఆర్5 జోన్‌ల్లో ఇళ్లస్థలాలను కేటాయించడం సరికాదన్నారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఇక్కడే ఉంటుందని ఎన్నికల తరువాత మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఉంటుందని చెప్పి ఇప్పుడేమో అభివృధ్ధి కోసం కేటాయించిన భూముల్లో ఇళ్లస్థలాల కేటాయించే ధోరణి చూస్తుంటే అమరావతి అనే పదం జగన్‌కు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

అమరావతిలో కట్టిన ఇళ్లను ఇప్పటివరకు ఇవ్వకుండా పారిశ్రామిక అభివృద్ధికి నిర్దేశించిన ఆర్5 జోనులో సెంటు స్థలాలు ఇవ్వాలన్న పరమార్థం ఏమిటో సీఎం చెప్పాలని మహేశ్వరరావు ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న పేదలకు ఇళ్ల స్థలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకే ఎందుకు పరిమితం చేస్తున్నారని నిలదీశారు.  అన్ని జిల్లాల్లో ఉన్న పేదలందరికీ ప్రభుత్వమే భూమి కొని ఇళ్లస్థలాలు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి అవసరమైతే అమరావతిలో ఇంకో 10 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసి రాష్ట్రంలోని పేదలందరినీ రాజధానికి తీసుకొని వస్తే అమరావతి నగరం కళలాడుతుందన్నారు. రాజధాని అభివృద్ధి కోసం రూపాయి చెల్లించకుండా 35 వేల ఎకరాలు భూములిచ్చిన రైతుల అనుమతి లేకుండా వాళ్ళ భూమిలో ఇళ్లస్థలాలు ఇవ్వచూడటం కుట్ర కోణం కనపడుతుందని మహేశ్వరరావు ఆరోపించారు.

Tags:    

Similar News