ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

by  |
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాలుగో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా దుర్గగుడి అవకతవకలపై అధికారలు తనిఖీలు నిర్వహించారు. దుర్గమ్మ ఆలయ ఆదాయం పక్కదారి పట్టినట్టుగా ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దుర్గగుడి స్టోర్స్, టికెట్ కౌంటర్లు, పరిపాలన, ఇంజనీరింగ్ విభాగం, అంతర్గత బదిలీలపై వివరాలు సేకరిస్తున్నారు. స్క్రాప్ విక్రయాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల అనంతరం ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ సోదాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 30 మంది అధికారులు పాల్గొన్నారు.

అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం, ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే అమ్మవారి హుండీ లెక్కింపులోని ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

Next Story