ముస్లింలను పావులుగా వాడుకున్న కాంగ్రెస్: ప్రధాని మోడీ

by Dishanational5 |
ముస్లింలను పావులుగా వాడుకున్న కాంగ్రెస్: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ముస్లింలను కాంగ్రెస్, ఇండియా కూటమి పావులుగా వాడుకున్నాయని, ఈ విషయాన్ని ముస్లింలు గ్రహించారని ప్రధాని మోడీ తెలిపారు. దీంతో వారు కాంగ్రెస్‌కు దూరమై, తమ అభివృద్ధిని చూసి బీజేపీకి దగ్గరవుతున్నారని వెల్లడించారు. యూపీలోని ధౌర్‌హరా లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారంతా బీజేపీకి చేరువయ్యారని తెలిపారు. ‘‘ముస్లిం సోదరులు, సోదరీమణులు పీఎం హౌజింగ్ స్కీమ్ కింద నిరుపేదలందరికీ ఇళ్లు ఇవ్వడం చూస్తున్నారు. ఉజ్వల యోజన కింద నల్లా కనెక్షన్, గ్యాస్ సిలిండర్‌ కనెక్షన్‌తోపాటు ప్రతి ప్రభుత్వ ప్రయోజనం అందరికీ అందుతుండటం చూస్తున్నారు. అందరితోపాటు ముస్లింలు సైతం లబ్ధి పొందుతున్నారు. వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారు’’ అని తెలిపారు. అయితే, ముస్లింల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్‌తోపాటు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సైతం మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పారని మోడీ వెల్లడించారు. కానీ, కాంగ్రెస్, ఇండియా కూటమి మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల దేశం మరోసారి దేశం ముక్కలవుతుందనే విషయాన్ని వారు గ్రహించడం లేదని మండిపడ్డారు.


Next Story

Most Viewed