వాళ్లంతా కాంగ్రెస్‌కు ఓటేయండి.. హరీష్ రావు పిలుపు

by Disha Web Desk 2 |
వాళ్లంతా కాంగ్రెస్‌కు ఓటేయండి.. హరీష్ రావు పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుబంధు డబ్బులు వచ్చిన వాళ్లంతా కాంగ్రెస్‌కు, రాని వాళ్లంతా బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్లమెంట్ స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసి రైతులను నిండా ముంచిన కాంగ్రెస్‌‌కు ఓటు వేయొద్దని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదనే కేజ్రీవాల్‌, కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఆ పార్టీ అధిష్టానానికి భిన్నంగా ఉందని విమర్శించారు. అక్రమ అరెస్టులను రాహుల్ గాంధీ ఖండిస్తుంటే.. రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారని సెటైర్లు వేశారు. గుజరాత్ మోడల్‌ ఫెయిల్ అని రాహుల్ అంటే.. అద్భుతమని రేవంత్ అంటున్నాడు.. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రా? బీజేపీ ముఖ్యమంత్రా? ప్రశ్నించారు. కేసీఆర్ బీజేపీతో ఎప్పుడూ క‌లిసేది లేదు.. బీఆర్ఎస్ లౌకిక పార్టీ అని హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేశారు. కవిత అరెస్ట్, రేవంత్ రెడ్డి స్పందనతో ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలిసిపోయిందని అన్నారు.

Next Story

Most Viewed