బట్లర్ మ్యాచ్ ఫీజులో కోత

by Dishafeatures2 |
బట్లర్ మ్యాచ్ ఫీజులో కోత
X

కోల్‌కతా : రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టారు. బట్లర్‌కు ఫైన్ విషయంలో మ్యాచ్ రిఫరీ స్పష్టమైన కారణం తెలియజేయనప్పటికీ.. అతను లీగ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు చెప్పాడు. ‘కోల్‌కతాతో మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన బట్లర్.. ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. అందుకే అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటనలో తెలిపింది. గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఖాతా కూడా తెరవకుండా రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో రన్ తీసేందుకు జోస్ బట్లర్ నో చెప్తున్నా మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వినిపించుకోకుండా పరుగు కోసం వచ్చేశాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రన్ కోసం వెళ్లిన బట్లర్‌‌ని ఆండ్రీ రస్సెల్ డైరెక్ట్ హిట్ ద్వారా అవుట్ చేశాడు. దాంతో అసహనంతో మైదానం వీడిన బట్లర్ ఏదో అనుకుంటూ వెళ్లాడు. అప్పుడు అతను అసభ్య పదజాలం వాడినట్టు తెలుస్తోంది. ఈ కారణంతోనే బట్లర్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించినట్టు సమాచారం. కాగా, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.


Next Story