వాగులో కొట్టుకుపోయిన తల్లి, కూతురు… తల్లి దుర్మరణం

by Taduka Kalyani |

మండల పరిధిలోని చౌటపల్లి గ్రామ సమీపంలో గల వాగు దాటడానికి ప్రయత్నించి కొందుర్గు మండలం గంగన్న గూడెం గ్రామానికి చెందిన పుష్పమ్మ (45), ఆమె కూతురు మండల పరిధిలోని గోవోనిపల్లి గ్రామానికి చెందిన సింధు వాగు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు.

వాగులో కొట్టుకుపోయిన తల్లి, కూతురు… తల్లి దుర్మరణం
X

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని చౌటపల్లి గ్రామ సమీపంలో గల వాగు దాటడానికి ప్రయత్నించి కొందుర్గు మండలం గంగన్న గూడెం గ్రామానికి చెందిన పుష్పమ్మ (45), ఆమె కూతురు మండల పరిధిలోని గోవోనిపల్లి గ్రామానికి చెందిన సింధు వాగు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. నీటి ఉధృతిని అంచనా వేయకుండా, వాగులోతును గమనించకుండా దాటడానికి ప్రయత్నించిన వారు నీటి ప్రవాహ ఉధృతికి లోతట్టు ప్రాంతానికి కొట్టుకుపోయారు. నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న సింధుకు వాగులో ఓ బండరాయి అడ్డుపడడంతో దానిని ఆసరాగా చేసుకుని ఉండగా, ఆమెను గమనించిన పశువుల కాపర్లు వాగు నీటిలో నుంచి బయటకు లాక్కొచ్చి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. పుష్పమ్మ

నీటి ఉధృతిలో లోతట్టు ప్రాంతానికి కొట్టుకుపోయింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరగగా రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులు,గ్రామస్తులు పుష్పమ్మ జాడ కోసం వాగు నీటిలో ఎంతగానో గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో రాత్రి వేళల్లో గాలింపు చర్యలు ఆపి సోమవారం ఉదయం మళ్లీ మొదలు పెట్టారు. వాగు నీటిలో కొట్టుకుపోయిన ప్రాంతం నుండి కొంత దూరంలోని చెట్ల మధ్య చిక్కుకున్న పుష్పమ్మ మృతదేహం లభించింది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. మృతురాలికి భర్త కృష్ణయ్య, ఐదుగురు సంతానం కలరు. వాగులో ఇసుక త్రవ్వకాలే వాగు లోతుకు కారణమని, అందువల్లే తల్లి మృత్యు బారిన పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Next Story