మనో మాలిన్యాలను తొలగించే దీపాలు..

by Disha edit |
మనో మాలిన్యాలను తొలగించే దీపాలు..
X

పుస్తకం ఓ మంచి నేస్తం. ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తోంది. పుస్తకం అమ్మలా లాలిస్తుంది, నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. బాధపడే వారిని ఓదారుస్తుంది. మనిషిలో మానసిక పరివర్తనను తీసుకువస్తుంది. అలసిన మనసులకు సేద తీర్చుతుంది. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా సమస్తంగా అన్ని తరాలవారినీ అలరిస్తోంది. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి దారి చూపెట్టే సాధనంగా దోహదపడుతుంది. మనోవికాసానికి, మార్గనిర్దేశానికి గురువులా ఉపయోగపడుతుంది. అందుకే జీవితంలో నిజమైన నేస్తం.. పుస్తకం.

జీవన విధానంలో పుస్తకాలు వచ్చాక విప్లవాత్మక మార్పులు వచ్చాయంటే నమ్మాల్సిందే. ఆధునిక జీవన విధానం చుట్టుముడుతున్న ఈ రోజుల్లోనూ పుస్తక పఠనాన్ని ఇష్టపడేవారూ గణనీయంగానే ఉన్నారని యునెస్కో చెప్పింది. కాలం ఎంత మారినా పుస్తక ప్రియులకు కొదవ లేదు. సినిమాలు, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ లాంటి అనేక ఆధునిక సాంకేతికత సాధనాలు అందుబాటులోకి వచ్చిన పుస్తకం పఠనానికి ప్రత్యేకత ఉన్నది. పుస్తకాలు గొప్ప ఆలోచనలకు పదును పెట్టి అనేక ఆవిష్కరణలు చేయడానికి తోడ్పడతాయి. మనుషులలో అజ్ఞానం ఛాయలు తొలగిపోయి విజ్ఞానం వైపు నడిపించే నావ ఓ మంచి పుస్తకం. "పుస్తకాలు మనో మాలిన్యాలను తొలగించే దీపాలు"అని భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారు.

అరుదైన పుస్తక భాండాగారం..

డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివే అలవాటులో కూడా విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఒకప్పుడు మనుషులు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, విశ్రాంతి సమయంలో చేతిలో పుస్తకం ఉండేది, కానీ నేడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటూ దాంట్లోనే చదివేస్తున్నారు.

నేటి డిజిటల్ యుగంలో 71 శాతం ప్రజలు పుస్తకాలను డిజిటల్ సాధనాలపైనే, కేవలం 29 శాతం మాత్రమే ప్రత్యక్షంగా పుస్తకాలను చదువుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పుస్తకాలు చదివేది మనదేశంలోనే. మనదేశంలో ఐదు ప్రముఖ పుస్తక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ కొత్త పుస్తకాలే కాదు, పాత పుస్తకాలు మరెక్కడా దొరకని అరుదైన గ్రంథాలు లభిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు పుస్తక మార్కెట్లు ఉన్నాయి. qfr దరియాగంజి, నైసాదక్ మార్కెట్లు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉండే పుస్తక మార్కెట్, పూణెలోని అప్పా బల్వంత్ చౌక్‌లో ఉండే పుస్తక మార్కెట్‌లో ప్రపంచంలో విలువైన పుస్తకాలన్నీ లభ్యమవుతాయి. హైదరాబాద్‌లోని కోఠి కూడా విలువైన పుస్తకాలకు కేంద్రంగా ఉంది.

ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే..

పుస్తకం మహాసముద్రంలాంటిది. అందుకే సంఘ సంస్కర్త కందుకూరు విరేశలింగం పంతులుగారు చిరిగిన చొక్క అయినా తొడుక్కోగానీ మంచి పుస్తకం కనుక్కో అని అన్నారు. కాని నేడు సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్ది ఇంటర్నెట్, వాట్సాప్ సంభాషణలతో పసి పిల్లాడి నుంచి పెద్దల వరకు విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారే గానీ ఎవ్వరూ కూడా మంచి పుస్తకం చదవటానికి మక్కువ చూపటం లేదు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో కథలు పుస్తకాలు చదివే అలవాటు చేస్తే అదే అలవాటుగా మారి యువతరం అన్ని విషయాల్లో పోటీపడినట్లే పుస్తకాలు చదవటంలో పోటీపడతారు. మనిషి మేధస్సును విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతో దోహద పడతాయానడంలో సందేహం లేదు. ఒకసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తుదివరకు జీవితాన్ని నడిపిస్తుంది. పుస్తకాలు చదవడం అంటే మానవత్వాన్ని పంచుకోవడం. ఇతరుల జీవితాల్లోకి అడుగుపెట్టడానికి, వారి కళ్లతో ప్రపంచాన్ని చూడటానికి, వారితో సహానుభూతి చెందడానికి పుస్తక పఠనం వీలు కల్పిస్తుంది. మహోన్నత విజ్ఞానం అందించే పుస్తక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని అజ్ఞానపు పొరలను తొలిగించు కోవాలి. అప్పుడే మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించుకోవడనికి అవకాశం ఉంటుంది. కావునా పుస్తకాలను చదవడం అలవాటుగా మార్చుకొని వాటి శక్తిని తెలుసుకోండి.

(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)

సంపతి రమేష్ మహారాజ్

79895 79428



Next Story

Most Viewed