ఒకే టీకాకు వేర్వేరు ధరలు ఎందుకు?

by  |
ఒకే టీకాకు వేర్వేరు ధరలు ఎందుకు?
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలు ఏమైపోవాలని ప్రశ్నించింది. పేదల ప్రజలు వ్యాక్సిన్‌ల కోసం ప్రైవేటు హాస్పిటళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలా? అని అడిగింది. పౌరులందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేసే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం తప్పక ఎంచుకోవాలని సూచించింది. దేశంలోని కరోనా పరిస్థితుల సుమోటోగా తీసుకుని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర రావ్, రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్నది. విచారణలో భాగంగా టీకా ధరను ఉత్పత్తిదారులే నిర్ణయించడానికి అనుమతి ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వానికి త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.

డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఔషధాల ధరను కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుందని గుర్తు చేసింది. అమెరికాలో ఆస్ట్రా జెనెకా ధర ఇక్కడి కంటే చాలా తక్కువ ఉన్నదని వివరించింది. అలాంటప్పుడు మనదేశమే ఎందుకు ఎక్కువ డబ్బులు వెచ్చించాలని ప్రశ్నించింది. ఒకే టీకాకు రెండు వేర్వేరు ధరలు ఎందుకు అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ. 150, రాష్ట్రాలకు రూ. 300 లేదా 400లను కంపెనీలు చార్జ్ చేస్తున్నాయని, ఈ తేడా ఎందుకు అని నిలదీసింది. ఈ తేడాను దేశ ప్రజలు ఎందుకు భరించాలని అని ప్రశ్నించింది. ధరల్లో ఈ తారతమ్యం 30 నుంచి 40 వేల కోట్ల వరకు వెళ్తుందని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వమే 100 శాతం టీకాలను ఎందుకు కొనుగోలు చేయవద్దని అడిగింది. సమాఖ్య స్ఫూర్తిని నొక్కి పలుకుతూ ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని పేర్కొంది. అలాగే, సోషల్ మీడియాలో ప్రజలు తమ బాధలు చెప్పుకోవడంపై ఆంక్షలు విధించవద్దని రాష్ట్రాలను ఆదేశించింది. అందులో ఒకరికొకరు కమ్యూనికేట్ కావడాన్ని అడ్డుకోరాదని తెలిపింది. దీన్ని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు దీన్ని బలమైన హెచ్చరికగా పరిగణించాలని తెలిపింది.



Next Story

Most Viewed