పేదలకు ఊరట.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by  |
పేదలకు ఊరట..  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేసేందుకు సర్కార్ ​కసరత్తులు ప్రారంభించింది. ప్రతీ 4 వేల మందికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నది. సుమారు 144 బస్తీ దవాఖాన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే బస్తీలు, పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆ రిపోర్టులకనుగుణంగా క్లినిక్​లు అందుబాటులోకి తేనున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానికుల నుంచి బస్తీ దవాఖానాల ఏర్పాటుకు డిమాండ్​ పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్​ కేంద్రాలకు అనుసంధానం చేయనున్నారు.

ప్రస్తుతానికి బీపీ, షుగర్​, మలేరియా, డెంగీ, హెచ్​ఐవీ, తదితర పరీక్షలు నిర్వహిస్తుండగా, రాబోయే రోజుల్లో రెడీయాలజీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. రిపోర్టులు ఆలస్యం కాకుండా వెంటనే మొబైల్​కు వచ్చేలా టెక్నాలజీని కూడా వాడనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లాకో టీ డయాగ్నస్టిక్స్​ కేంద్రం అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా టెస్టింగ్​, ట్రీట్​మెంట్​ నిర్వహిస్తామని మెడికల్​ ఆఫీసర్లు స్పష్టమైన భరోసా కల్పిస్తున్నారు.

పేదలకు ఉపయోగం

ఇప్పటి వరకు గ్రేటర్​ హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన 258 బస్తీ దవాఖాన్ల కేంద్రంగా సుమారు 11 లక్షల మందికి ఫ్రీగా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. అంతేగాక అంతకు మూడు రెట్ల మందికి ఓపీ పరీక్షించి మందులు ఇచ్చినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. అతి త్వరలో ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరో 92 బస్తీ దవాఖాన్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.

Next Story

Most Viewed