ముంచుకొస్తున్న ముప్పు.. మిగిలింది పది రోజులే

by  |
ముంచుకొస్తున్న ముప్పు.. మిగిలింది పది రోజులే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం విడుదల చేసిన గెజిట్​ ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెల 14 నుంచి గెజిట్​ అమల్లోకి రానున్నట్లు ఇప్పటికే కేంద్రం నోటిఫికేషన్​లో పేర్కొంది. కానీ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై ఉమ్మడి ఫెయిల్యూర్​ మూటగట్టుకుంటున్నారు. గెజిట్​ను విడుదల చేసిన కేంద్రం.. గైడ్​లైన్స్​పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ గైడ్​లైన్స్​ రూపొందించడంలో బోర్డుల అభిప్రాయాలను సైతం తీసుకోలేదు. మరోవైపు ఇరు రాష్ట్రాల నుంచి ఇంజినీర్లు వస్తారా.. రాష్ట్రాలు కేటాయిస్తాయా అనే సందేహంలో బోర్డులు తలమునకలువుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలతో రెండుసార్లు సమావేశం ఏర్పాటు చేసింది. నీటివాటా కేటాయింపులపైనే రాద్ధాంతం జరిగింది. కానీ గెజిట్​ అమలుకు ఏపీ ఆమోదంగానే ఉన్నా.. తెలంగాణ మాత్రం వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వర్క్​ ఛార్జ్​ రెడీ చేయడంలో రెండు బోర్డులు కుస్తీ పడుతూనే ఉన్నాయి. ఇక గెజిట్​ అమలుపై రాష్ట్రాలు కూడా ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. బోర్డుల పరిధి ఓకే అంటూ ఏపీ చెప్పినా.. మార్పులు చేయాలంటూ సూచిస్తోంది. ఇక తెలంగాణ మాత్రం గెజిట్​ ఇప్పుడు వద్దే వద్దు అంటూ స్పష్టం చేస్తోంది. నిర్వహణ కోసం చెరో రూ. 200 కోట్లు బోర్డుల ఖాతాల్లోకి జమ చేయాలన్నా.. ఇస్తామని ఏపీ చెప్పింది. కానీ తెలంగాణ నుంచి రిప్లై లేదు. దీంతో బోర్డుల పరిధి ఖరారుపై అన్ని వైపులా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిని కలువడం, గెజిట్​పై చర్చించిందుకే సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటన చేశారు.

వాయిదాకే విన్నపం

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు కేవలం 10 రోజులే గడువు ఉంది. గెజిట్​ విడుదల చేసిన కేంద్రం సైలెంట్​ అయింది. మరోవైపు దీనిపై బోర్డులు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను మొదలుపెట్టి వాయిదా వేయించి.. ఆ వెంటనే ఢిల్లీ ఫ్లైట్​ ఎక్కేశారు. దీనికి కేసీఆర్​కు కూడా కీలక సాకు దొరికింది. తెలుగురాష్ట్రాల మ‌ధ్య కృష్ణా, గోదావ‌రి జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం జులై 15న గెజిట్​ జారీ చేసింది. కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ల‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. అక్టోబ‌ర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానుందని, బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులున్న ప్రాజెక్టుల‌న్నీ ఆయా బోర్డుల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం వెల్లడించింది. కృష్ణాన‌దిపై 36, గోదావ‌రిపై 71 ప్రాజెక్టుల‌ను బోర్డుల ప‌రిధిలోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమ‌తిలేని ప్రాజెక్టులకు 6 నెల‌ల్లోగా అనుమ‌తులు తెచ్చుకోవాల‌ని, ఒక‌వేళ అనుమ‌తులు రాకుంటే ప్రాజెక్టులు నిలిపివేయాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. బోర్డుల‌కు ఛైర్మ‌న్లు, స‌భ్య‌కార్య‌ద‌ర్శి, చీఫ్ ఇంజ‌నీర్లు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వారే ఉంటారని, అన్ని ప్రాజెక్టుల నిర్వాహ‌ణ బోర్డులే చూసుకుంటాయ‌ని, ఒక్కోరాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్లు చోప్పున డిపాటిట్ చేయాల‌ని, సీడ్ మ‌నీ కింద 60 రోజుల్లో ఈ మొత్తాన్ని డిపాటిట్ చేయాల‌ని కేంద్రం పేర్కొన్న‌ది. నిర్వహ‌ణ ఖ‌ర్చుల‌కు బోర్డులు అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

స్వరూపమే లేదు

గెజిట్లు జారీ చేసిన సర్కారు.. ఆ తర్వాత దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో డిపాజిట్​ చేయాలని సూచించారు. ఈ గడువు ఈ నెల 14తో ముగిసింది. కానీ ఒక్క రాష్ట్రం కూడా రూపాయి ఇవ్వలేదు. దీనికితోడు ఇరిగేషన్​ శాఖ ఇంజినీర్లను బోర్డుకు అప్పగించాలన్నారు. దీనికి ఏపీ సమ్మతి తెలిపింది. కానీ తెలంగాణ ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. ఇటీవల రెండు బోర్డులకు సీడబ్ల్యూసీ నుంచి ఇద్దరు సీఈలను నియమించిన కేంద్రం.. వారికి వర్క్​ ఛార్ట్​ కూడా ఇవ్వలేదు. వీటిని సీఎం కేసీఆర్​ అనుకూలంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బోర్డుల స్వరూపమే సిద్ధం కాలేదనే కారణంతో గెజిట్‌ అమలు వాయిదా వేయించాలని భావిస్తున్నారు.

కేంద్ర బలగాలపైనా రిప్లై లేదు

మరోవైపు బోర్డుల పరిధికి రానున్న ప్రాజెక్టులపై సీఐఎస్​ఎఫ్​ బలగాలను మోహరించేందుకు కేంద్రానికి నివేదించారు. కానీ కేంద్రం దానికి రిప్లై ఇవ్వలేదు. దీంతో బోర్డులు కూడా ఒక విధంగా సైలెంట్​ అయ్యాయి. కేంద్రం నుంచే ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో బోర్డులు కూడా నెమ్మదించాయి. అంతేకాకుండా సీఐఎస్​ఎఫ్‌ సిబ్బందికి అవసరమయ్యే వసతి సౌకర్యాలు, మౌలిక వసతులు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, వారి జీతభత్యాలకు సంబంధించిన రిపోర్ట్​ను రెండు రాష్ట్రాలకు పంపించాయి. రాష్ట్రాల నుంచి నుంచి నో రిప్లై. ఒక విధంగా గెజిట్​ అమలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలతో పాటు బోర్డులు కూడా ఒకింత నిర్లక్ష్యంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. సమయం దగ్గర పడుతున్నా.. కేంద్రం కూడా హడావుడి చేయడం లేదు. దీనికితోడు రాష్ట్రాలు కూడా అంతే సైలెంట్​గా ఉంటున్నాయి. సెప్టెంబర్​ 1 నుంచి 9 వరకు సీఎం కేసీఆర్​ ఢిల్లీలోనే పర్యటించారు. అనంతరం గత నెల 24న కూడా ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రులను కలిశారు. అందుకే గెజిట్​పై కేంద్రం వెనక్కి తగ్గుతుందనే ఆరోపణలు సైతం వచ్చాయి.

అనుమతుల్లేవ్​..!!

రాష్ట్రంలో రెండు నదులపై ఉన్న ప్రాజెక్టుల్లో అనుమతి లేనివే ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ఇప్పుడు అనుమతులు తీసుకోవాలంటే సాధ్యం కాదు. మరోవైపు ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లను ఇటీవలే రాష్ట్రం నుంచి బోర్డులకు అందించారు. వీటిని అధ్యయనం చేస్తామని కేంద్రానికి కూడా ఓ కాపీని పంపించారు. మొత్తంగా రాష్ట్రంలో మేజర్​, మీడియం, మైనర్​ ప్రాజెక్టులన్నీ కలుపుకుని దాదాపు 27 ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉంది. అనుమతులు రాకుంటే అక్కడ మట్టి కూడా తీయడానికి అవకాశం ఉండదు. మరోవైపు అనుమతులు లేకున్నా పనులు మొదలుపెట్టారు. దీనికి వేల కోట్లు బిల్లులు ఇవ్వాల్సి ఉంది. బోర్డుల పరిధి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రుణాలు వచ్చేది కూడా కష్టమే. ఈ నేపథ్యంలోనే గెజిట్​ అమలు వాయిదా వేసేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

అనుమతి‌ లేని ప్రాజెక్టులివే..

తెలంగాణ: ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌, డిండి (నక్కలగండి) లిఫ్ట్‌‌, కల్వకుర్తి విస్తరణ, ఏఎమ్మార్పీ, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, నెట్టెంపాడు విస్తరణ, సీతారామ ఎత్తిపోతల, మున్నేరు ప్రాజెక్టు, దేవాదుల పరిధిలోని డబ్బవాగు, మైలవరం రిజర్వాయర్‌‌, కంతనపల్లి, తుపాకులగూడెం బ్యారేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్‌‌ టీఎంసీ, రామప్ప నుంచి పాకాల లేక్‌‌ డైవర్షన్‌‌ స్కీం, మొండికుంటవాగు, ప్రాణహిత-–చేవెళ్ల, గూడెం లిఫ్ట్‌‌, ముక్తేశ్వర్‌‌ (చిన్న కాళేశ్వరం) లిఫ్ట్‌‌.

టెక్నికల్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ రావాల్సిన ప్రాజెక్టులు

రెండు రాష్ట్రాలు టెక్నికల్‌‌‌‌ అడ్వయిజరీ కమిటీ క్లియరెన్స్‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకుని, పర్మిషన్‌‌‌‌ రావాల్సిన ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌‌‌‌లో పొందుపరిచింది. తెలంగాణలోని మున్నేరు లెఫ్ట్‌‌‌‌ కెనాల్‌‌‌‌, పాకాల లేక్‌‌‌‌, వైరా లేక్‌‌‌‌, ఊట్కూరు –మార్పల్లి రిజర్వాయర్‌‌‌‌, అసిఫ్‌‌‌‌ నహర్‌‌‌‌, వీపనగండ్ల, హిమాయత్‌‌‌‌సాగర్‌‌‌‌, ఉస్మాన్‌‌‌‌సాగర్‌‌‌‌ డ్రింకింగ్‌‌‌‌ వాటర్‌‌‌‌ ప్రాజెక్టులు, శామీర్‌‌‌‌పేట్‌‌‌‌ లేక్‌‌‌‌, సరలాసాగర్‌‌‌‌, లంకసాగర్‌‌‌‌, సింగోటం, జూట్‌‌‌‌పల్లి ప్రాజెక్టు, ఏపీ నిర్మిస్తున్న బుడమేరు డైవర్షన్‌‌‌‌ ప్రాజెక్టు, తొర్రిగడ్డ లిఫ్ట్‌‌‌‌, సీలేరు పవర్‌‌‌‌ ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్: గాలేరు– నగరి, వెలిగొండ ప్రాజెక్టు, నల్లమల సాగర్‌‌, ముచ్చుమర్రి, సిద్ధాపురం లిఫ్ట్‌‌, గురురాఘవేంద్ర, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి, వెంకటనగరం లిఫ్టులు, వేంపాడు ప్రాజెక్టు, విభజన చట్టంలో చేర్చిన తెలుగుగంగ, హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ లిఫ్ట్‌‌.



Next Story

Most Viewed