రియల్టర్లకు షాక్

by  |
రియల్టర్లకు షాక్
X

దిశ, న్యూస్‌బ్యూరో: నియమ నిబంధనలను పాటించని రియల్టర్లకు రిజిస్ట్రేషన్‌ల శాఖ షాక్ ఇచ్చింది. ఇక అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు, అనుమతిలేని నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌లు ఉండవని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా రిజిస్ట్రార్‌లకు, సబ్ రిజిస్ట్రార్‌లకు రిజిస్ట్రేషన్‌ల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ టి. చిరంజీవులు ఆదేశాలు జారీచేశారు. కేవలం ప్రభుత్వ అధికారిక సంస్థతో ఆమోదించబడిన లేఅవుట్లలోని ప్లాట్లకు, చట్టం ప్రకారం అనుమతులున్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌లు చేయడం జరుగుతుందని తేల్చిచెప్పారు.

ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పథకాల కింద క్రమబద్ధీకరించబడిన ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్లకు అనుమతించబడుతుందని ఆ ఆదేశాల్లో వివరించారు. గతంలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నప్పటికీ ఇక ముందు ఆ ప్లాట్‌కు కూడా రిజిస్ట్రేషన్ చేయబడదని కూడా ఆదేశాల్లో హెచ్చరించారు. ప్రతి గ్రామంలో, మునిసిపల్ కార్పోరేషన్, పట్టణాభివృద్ది సంస్థ పరిధిలోనూ ఈ నియమనిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇళ్ళు, భవనాలు, అపార్టుమెంట్లు (ఫ్లాట్లు) లేదా ఏదైనా నిర్మాణాలు సంబంధిత అధికారిచే లేదా అధికారిక సంస్థలతో అనుమతులు కలిగి ఉంటేనే రిజిస్ట్రేషన్‌లు చేయబడుతాయని అందులో స్పష్టంగా తెలియజేశారు.

Next Story