వెనకబడుతున్న తెలంగాణ.. ఏటేటా అప్పుల్లోకి డిస్కంలు

by Disha Web Desk 2 |
వెనకబడుతున్న తెలంగాణ.. ఏటేటా అప్పుల్లోకి డిస్కంలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెండు డిస్కం సంస్థలు ఏటేటా అప్పుల్లోకి కూరుకుపోతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం 'ఉదయ్' లాంటి స్కీమ్ ద్వారా ఆర్థిక సాయం అందించినా మళ్ళీ నష్టాల్లోకే వెళ్ళిపోయాయి. ఆర్థిక నష్టాలను ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణలోని రెండు డిస్కంలకు కలిపి 2020 మార్చి చివరి నాటికి రూ.42,293 కోట్లుగా తేలింది. దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల తర్వాతి స్థానం తెలంగాణదే. ప్రతీ నెలా చెల్లించాల్సిన బకాయిల్లోనూ తెలంగాణ వెనకబడే ఉన్నది. గత నెల చివరి నాటికి రెండు డిస్కంలకు కలిపి రూ. 6,889 కోట్లు ఉన్నట్లు పవర్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన 'ప్రాప్తి' ద్వారా వెల్లడైంది.

తెలంగాణలోని ఉత్తర, దక్షిణ డిస్కంల ఆర్థిక పరిస్థితి ఏటేటా దిగజారుతున్నది. 2018 మార్చి చివరి నాటికి రెండు డిస్కంలకు కలిపి రూ. 28,209 కోట్ల నష్టం ఉంటే మరుసటి సంవత్సరానికి అది రూ. 36,231 కోట్లకు చేరుకున్నది. 2020 మార్చి చివరి నాటికి రూ. 42,293 కోట్లకు పెరిగింది. డిస్కంలు నష్టాల్లోనే ఉన్నందునే విద్యుత్ ఛార్జీలను పెంచుకోడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి గతేడాది డిసెంబరు చివర్లో సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికల్లోనూ రెండు డిస్కంలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. నష్టాల నుంచి గట్టిక్కి స్వయం సమృద్ధి సాధించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ సహకరాన్ని కోరాయి. కానీ ఇప్పటివరకు విద్యుత్ ఛార్జీలను పెంచడంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు.

ఉత్తర డిస్కం కంటే దక్షిణ డిస్కంలోనే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఏటా సుమారు రూ.11 వేల కోట్లకు పైగానే ఖర్చవుతున్నది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్ అవుతున్నా సకాలంలో అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నది. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. కానీ దీనికంటే ఎక్కువగా దక్షిణ డిస్కంలోనే నష్టాలు పేరుకుపోతుండడం గమనార్హం. రెండు డిస్కంలకు కలిపి నష్టాలు రూ. 42,293 కోట్లు ఉంటే అందులో దక్షిణ డిస్కంకు చెందినవే రూ. 29,309 కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ. 12,984 కోట్లు ఉత్తర డిస్కంకు చెందినవి. 2018 మార్చి నాటికి దక్షిణ డిస్కం నష్టం రూ. 19,395 కోట్లు ఉంటే మూడేళ్ళకే (2020 మార్చి నాటికి) అది రూ. 29,309 కోట్లకు పెరిగింది.

Next Story

Most Viewed