Munugode: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుమార్తె?

by Disha Web Desk 4 |
2 Congress Leaders in Gujarat are Set to Join BJP
X

దిశ, వెబ్‌డెస్క్: Is Sravanthi Contestant in Munugode Constituency From Congress? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతుంది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేంది లేదని రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు హెచ్చరికలు చేశారు. అయినా రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హస్తం పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం దాదాపు ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూ రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్‌గా మారనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడితే ఆ పార్టీ నుండి పోటీ చేసే నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు అనేది చర్చగా మారింది.

రాజగోపాల్ స్థానంలో సీనియర్ నేత కుమార్తె?

రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఉపఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే అప్పుడు తమ అభ్యర్థి ఎవరు అనేదానిపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీతోనే ఉందనే టాక్ వినిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. బీజేపీ నుండి బరిలో నిలిచిన గంగిడి మనోహర్ రెడ్డి 6.40 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఉపఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే ఆయన స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ప్రధానమైన అంశం. ఒకవేళ ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ మాజీ మంత్రి, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతిని బరిలోకి దించే అవకాశాలపై పార్టీ అధిష్టానం చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం స్రవంతి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే పద్మశాలీలు, గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీసీ నాయకుడిని బరిలోకి దించే అవకాశాలను సైతం అధిష్టానం ఆలోచిస్తోందట.

ఈటల గెలుపంత ఈజీ కాదా?

తెలంగాణ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం పక్కాగా ఉంటోంది. ఎవరైనా పదవిలో ఉన్న వారు తమ పార్టీలోకి రావాలంటే ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ కండువా కప్పుకోవాలనేది పార్టీ పెద్దల నిర్ణయంగా తెలుస్తోంది. రాజీనామా తర్వాత బీజేపీ గుర్తుతో గెలవడం ద్వారా తెలంగాణలో కమలం పార్టీ సత్తా ఏంటో తెలిసేలా కమలనాథుల ఎత్తుగడ ఇది. గతంలో ఈటల విషయంలోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటల.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉపఎన్నికకు వెళ్లారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి సైతం రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే హుజూరాబాద్ లో ఈటలకు సానుభూతి ఉంది. కానీ మునుగోడులో అలాంటి పరిస్థితి లేదు. ఇది కేవలం రాజకీయ బలాబలాల నిరూపణ కోసం జరిగే ఉపఎన్నిక అవుతుంది. పార్టీలో అసంతృప్తి కారణంగా బీజేపీలో చేరడం వల్ల వచ్చిన ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఏ మేరకు మద్దతు ఇస్తారనేది సందేహాంగా మారింది.

ఇప్పటికే టీఆర్ఎస్ తన సత్తా ఏంటో చాటేందుకు పావులు కదుపుతోంది. పోలింగ్ నాటికి రాజగోపాల్ రెడ్డి వర్గీయులను తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హుజూరాబాద్ లో గెలిచినంత ఈజీగా గెలవడం మునుగోడులో బీజేపీకి సాధ్యం అయ్యే పనేనా? అనే చర్చ సాగుతోంది. అందువల్ల రాజకీయ సత్తా చాటుకునేందుకు జరిగే మునుగోడు ఉప ఎన్నికలో ఎవరి చరిష్మా ఏంటో తేలిపోనుంది. ముఖ్యంగా పార్టీలో సీనియర్లతో తలపోటుగా మారిన రేవంత్ రెడ్డికి ఈ బై ఎలక్షన్ భారీ సవాల్ గా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రస్తుతానికి అవసరం లేదనే ఎన్నికగా విశ్లేషకులు చెబుతున్నారు.

రాబోయే శాసన సభ ఎన్నికల ముంగిట్లో ఉపఎన్నికల ఫలితం తారుమారు అయితే అది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపక మానదు. ఈ స్థానంలో బీజేపీ గెలుపు ఎలా ఉన్నా గతంలో తమ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మెరుగుపరుచుకోవడం ఖాయం. గెలుపు ఖాయం అయితే గెలిచామని చెప్పుకోవడానికి, ఓటమి పాలై ఓట్ల శాతం పెరిగితే తాము మెరుగు పడ్డామని చెప్పుకోవడానికి బీజేపీకి దారి ఉంది. కానీ ఎటు తీసి ఇబ్బంది అంతా టీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టే అనేది జరుగుతున్న ప్రచారం. కాంగ్రెస్ ఓటమి పాలైతే సిట్టింగ్ స్థానం కోల్పోయినట్లు అవుతుంది. టీఅర్ఎస్ ఓడిపోతే గనుక ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా బీజేపీ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నిక వస్తే అది కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు తల నొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు



Next Story

Most Viewed