తెలంగాణ బడ్జెట్‌లో పావు వంతు అప్పులే..

by Disha Web Desk |
తెలంగాణ బడ్జెట్‌లో పావు వంతు అప్పులే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతేడాది వేసుకున్న బడ్జెట్ అంచనాల్లో సుమారు రూ. 20 వేల కోట్లు తగ్గినా ఈసారి మాత్రం దాదాపు రూ.46 వేల కోట్లను ఎక్కువగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రెవెన్యూ ఆదాయం రూపంలో రూ. 1.93 లక్షల కోట్ల మేర వస్తుందని అంచనా వేసుకుని దానికి తగినట్లుగా రెవెన్యూ ఖర్చును రూ. 1.89 లక్షల కోట్ల మేర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ. 3,754 కోట్ల మిగులుతో ఉంటుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. రెవెన్యూ, కాపిటల్ ఆదాయం కలిపి రాష్ట్రానికి సుమారు రూ. 2.56 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేసి రెండు రకాల ఖర్చులు కలిసి రూ. 2.56 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో ప్రభుత్వం దగ్గర కేవలం రూ. 3.26 కోట్ల మేరకు మాత్రమే మిగిలి ఉండేలా లెక్కలు రూపొందించింది.

రాష్ట్ర స్వీయ పన్నులతో పాటు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో మొత్తం రూ. 1.93 లక్షల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. రిజర్వు బ్యాంకు ద్వారా 'ఓపెన్ మార్కెట్ లోన్స్' పేరుతో రూ. 53,970 కోట్లను, ఇతర రూపాల్లో రూ. 5,602 కోట్లను సమకూర్చుకోనున్నది. మొత్తంగా పబ్లిక్ డెట్ పేరుతో రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 59,672 కోట్లను రుణాలుగా తీసుకోనున్నది. ఇప్పటికే రాష్ట్రానికి రూ. 2.85 లక్షల కోట్లు అప్పు ఉండగా దీనితో కలిపి రూ. 3.30 లక్షల కోట్లకు చేరుకుంటున్నది. గతంలో చేసిన అప్పుల్లో సుమారు రూ. 11.601 కోట్లను ఈ ఏడాది చెల్లించేలా బడ్జెట్‌లో కేటాయింపు చేసింది. ఇప్పటివరకు చేసిన అప్పులకు రానున్న సంవత్సరంలో వడ్డీల చెల్లింపుల కోసమే రూ. 18,921 కోట్లను చెల్లించనున్నది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అప్పు రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటింది.

పెరగనున్న సొంత పన్నుల రాబడి

ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్నుల ద్వారా రూ. 1.08 లక్షల కోట్లను సమీకరించుకునేలా ప్రణాళిక వేసుకున్నది. గతేడాది సుమారు రూ. 93 వేల కోట్లు మాత్రమే అంచనా వేసుకున్నా ఈసారి మద్యం, ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా కొంత పెరగొచ్చనే ఉద్దేశంతో గతేడాది కంటే రూ. 15 వేల కోట్లను ఎక్కువగా సమకూర్చుకోవాలనుకుంటున్నది. ఇందులో కేవలం మద్యం ద్వారా రూ. 19,720 కోట్లు, పెట్రోలు ద్వారా మరో రూ. 13,280 కోట్లను రాబట్టేలా ప్రణాళిక వేసుకున్నది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 17,500 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ. 36,203 కోట్ల చొప్పున ఆదాయం సమకూరుతుందని అంచనా వేసుకున్నది. ఇక మైనింగ్, ఇసుక ద్వారా రూ. 6,399 కోట్లు, భూముల అమ్మకం ద్వారా రూ. 19,023 కోట్లు వస్తాయని లెక్కలు వేసుకున్నది.

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, వివిధ సంక్షేమ పథకాల వాటాలు, జీఎస్టీ పరిహారం, నీతి ఆయోగ్ సిఫారసులు, వెనకబడిన జిల్లా అభివృద్ధి నిధులు, 15వ ఆర్థిక సంఘం వాటా తదితరాలన్నీ కలిపి సుమారు రూ. 59,396 కోట్లు వస్తుందని అంచనా వేసింది. వీటన్నింటినీ కలుపుకుని రాష్ట్రానికి రెవెన్యూ ఆదాయంగా రూ. 1.93 లక్షల కోట్లు సమకూరుతుందని వివరించింది. రిజర్వు బ్యాంకు ద్వారా అప్పులు, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో మరో రూ. 59,396 కోట్లను సమకూర్చుకోనున్నట్లు వివరించింది. మొత్తం బడ్జెట్‌లో దాదాపు పావు వంతు మేర రకరకాల పేర్లతో రుణాల ద్వారా సమకూర్చుకోవడం గమనార్హం.

రాష్ట్ర బడ్జెట్ ముఖచిత్రం

మొత్తం బడ్జెట్ : రూ. 2,56,958 కోట్లు

మొత్తం వసూళ్లు : రూ. 2,56,961 కోట్లు

మొత్తం ఖర్చు : రూ. 2,56,958 కోట్లు

మిగులు : రూ. 3.26 కోట్లు


ఆదాయ మార్గాలు :

సొంత పన్నులు : రూ. 1,08,211 కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా : రూ. 18,394 కోట్లు

నాన్-టాక్స్ రెవెన్యూ : రూ. 25,421 కోట్లు

గ్రాంట్-ఇన్-ఎయిడ్ : రూ. 41,001 కోట్లు

పబ్లిక్ డెట్ (అప్పులు) : రూ. 59,672 కోట్లు

పబ్లిక్ అకౌంట్ : రూ. 4,200 కోట్లు

లోన్ల రికవరీ : రూ. 60 కోట్లు

మొత్తం : రూ. 2,56,961 కోట్లు


ఖర్చుల వివరాలు :


సంక్షేమానికి : రూ. 93,489 కోట్లు

జనరల్ సర్వీసెస్ : రూ. 43,730 కోట్లు

జీతాలు, పరిపాలన : రూ. 52,045 కోట్లు

వడ్డీ చెల్లింపులకు : రూ. 18,921 కోట్లు

అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ : రూ. 10,741 కోట్లు

ఇతర ఖర్చులు రూ. 12,355 కోట్లు

మొత్తం ఖర్చు రూ. 1,89,274 కోట్లు

మిగులు : రూ. 3,754 కోట్లు




Next Story

Most Viewed