ద‌స‌రా ఉత్సవాల్లో ఎమ్మెల్యే జోక్యం సిగ్గుచేటు: ఎర్రబెల్లి ప్రదీప్ రావు

by Dishanational2 |
ద‌స‌రా ఉత్సవాల్లో ఎమ్మెల్యే జోక్యం సిగ్గుచేటు: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఉర్సు రంగ‌లీల మైదానం ద‌స‌రా ఉత్స‌వ క‌మిటీలో ఎమ్మెల్యే న‌రేంద‌ర్ జోక్యం చేసుకోవ‌డం సిగ్గు చేట‌ని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. అతిథి స్థానంలో ఉండాల్సిన ఎమ్మెల్యే ఉత్సవ క‌మిటీలో అజ‌మాయిషీ చేయాల‌నుకోవ‌డం ఆయ‌న దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శన‌మ‌ని అన్నారు. వ‌రంగ‌ల్ ప‌ట్టణంలో ప‌లు చోట్ల ఎన్నో ద‌శాబ్ధాలుగా ద‌స‌రా ఉత్సవ క‌మిటీల ఆధ్వర్యంలో వేడుక‌లు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఈసంద‌ర్భంగా ప్రజాప్రతినిధుల‌తో పాటు వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖుల‌ను క‌మిటీలు అతిథులుగా ఆహ్వానిస్తున్నాయ‌ని అన్నారు. అయితే ఉత్సవ క‌మిటీల్లో కూడా ఎమ్మెల్యే రాజ‌కీయాలు చేయ‌డం దారుణ‌మ‌ని ప్రదీప్‌రావు దుయ్యబ‌ట్టారు. గురువారం వ‌రంగ‌ల్‌లోని ఆయ‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

ద‌స‌రా ఉత్సవ క‌మిటీలో ఎమ్మెల్యే జోక్యం పెరిగిపోయింద‌ని, త‌న‌కు న‌చ్చిన వ్యక్తుల‌కే క‌మిటీలో చోటు ద‌క్కేలా నిర్బంధంగా, బెదిరింపుల‌తో క‌మిటీ నియామ‌కం జ‌రిగేలా చూస్తుండ‌టం ఆయ‌న వైఖ‌రిని తెలియ‌జేస్తోంద‌ని అన్నారు. యావత్తు తెలంగాణలో దసరా ఉత్సవాలకు ఓరుగల్లు పెట్టింది పేర‌ని, అలాంటి చరిత్రను అందించిన ఉత్సవకమిటీ సభ్యులపై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే తన వర్గం వారిచే అభియోగాలు, నిందారోపణ‌లు చేయించి తొలగించాలనుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ మండిప‌డ్డారు. దశాబ్ధాలుగా ఐకమత్యంగా ఉంటూ దసరా ఉత్సవాలు జరిపిన సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన ఘనత తూర్పు ఎమ్మెల్యేకే దక్కిందన్నారు. కొన్నిరోజులుగా కుల సంఘాలు, చిరు వ్యాపార, వర్తక సంఘాల కమిటీలలో తనవర్గం వారు మాత్రమే ఉండాలని స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే, అదే ధోరణిలో నేడు దసరా ఉత్సవ కమిటీలో కూడా తన వర్గం వారే ఉండాలని కొందరి సభ్యుల మీద అభియోగాలు మోపడం వారి యొక్క నియంతృత్వ పోకడకు నిదర్శనమ‌ని అన్నారు.


Next Story

Most Viewed