కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ.. ఆ ప్రశ్నలకు సీఎం బదులిస్తారా..?

by Disha Web Desk |
కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ.. ఆ ప్రశ్నలకు సీఎం బదులిస్తారా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంపై చెప్పుకుంటున్న గొప్పల వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం దాగి ఉందని... కానీ, వారి శ్రమకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి మోసం అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసే కీలకమైన ప్రాజెక్టుల్లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో 2008 నుంచి 2013 వరకు పాలుపంచుకున్న వారిని ఆర్టిజన్స్‌గా నియమించుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది. కానీ, 6వ దశ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం క్షమించరాని విషయమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ సమయంలో 6వ దశలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా తీసుకుంటామని సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు రాత పూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 7వ దశ నిర్మాణం సందర్భంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా సీఎండీ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారన్నారు. 7వ దశ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సీఎండీ మాట మీద గౌరవంతో 7వ దశ నిర్మాణానికి కార్మికులు పూర్తిగా సహకరించారని రేవంత్ రెడ్డి అన్నారు.

2018, అక్టోబర్ 7న పాల్వంచ గెస్ట్ హౌజులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైతం సీఎండీ మరోసారి ఇదే హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా సీఎండీ తెలిపారన్నారు. ఇదంతా జరిగి ఐదేళ్లు అవుతున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం అత్యంత దురదృష్టకరం అంటూ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీరేమో ఇవేమీ పట్టన్నట్లు రాజకీయాలు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా అంటూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన ఈ విధంగా ఉంటే కార్మికుల సమస్యను తీర్చెదెవరు? అంటూ ప్రశ్నించారు. కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ సమయంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నా వాటిని లెక్క చేయకుండా పని చేసిన కార్మికుల కష్టాన్ని విస్మరించడం దారుణం అన్నారు. ఈ సందర్భంగా గతంలో సీఎండీ హామీ ఇచ్చిన విధంగా తక్షణమే కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్‌గా నియమించి వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed