బీఫ్ తినమన్నారు.. ఖురాన్ చదవమని ఒత్తిడి తెచ్చారు.. లవ్ జిహాద్ బాధితురాలు ఆవేదన

by Ramesh Naini |

నగరంలోని కూకట్‌పల్లిలో సంచలనం రేపుతున్న ‘లవ్ జిహాద్’ ఘటనలో తీవ్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బీఫ్ తినమన్నారు.. ఖురాన్ చదవమని ఒత్తిడి తెచ్చారు.. లవ్ జిహాద్ బాధితురాలు ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని కూకట్‌పల్లిలో సంచలనం రేపుతున్న ‘లవ్ జిహాద్’ ఘటనలో తీవ్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ట్రాప్ చేసిన యువకుడు.. ఆమె మతం మార్చడంతో పాటు, తన సోదరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. తనపై జరిగిన అకృత్యాలను వివరిస్తూ ఆమె తాజాగా సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందుకు వచ్చి కన్నీరుమున్నీరుగా తన ఆవేదనను పంచుకుంది. నెల్లూరుకు చెందిన నవాజ్ అనే వ్యక్తి.. 2025 మే నెలలో కూకట్‌పల్లిలో ట్రేడింగ్, ఫుడ్ బిజినెస్ పేరుతో బాధితురాలి కుటుంబానికి పరిచయమైనట్లు తెలిపింది. తాను హిందువుగా మారిపోయానని, తన పేరు ‘నవదుర్గ’ అని నమ్మించేందుకు ఏకంగా ఓ సర్టిఫికెట్ కూడా చూపించాడని వెల్లడించింది. నవాజ్ సోదరులు కూడా ఇదే మాట చెప్పి ఆమెను నమ్మించారని, భవిష్యత్తులో దుబాయ్ వెళ్లిపోదామని మాయమాటలు చెప్పి, గత ఏడాది జూలైలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లి సమయంలో ఆమె పేరును ‘నజీరా’గా మార్చాడని ఆరోపించారు.

మతం మార్చి, చిత్రహింసలు

అక్టోబర్ నెలలో నవాజ్‌కు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు బాధితురాలికి తెలిసింది. దీంతో నవాజ్ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడని, గుల్బర్గాలోని ఖాజా నవాజ్ దర్గా వద్దకు తీసుకెళ్లి బలవంతంగా మతం మార్పించి, కల్మా చదివించాడని తెలిపింది. చెప్పిన మాట వినకపోతే తీవ్రంగా కొట్టేవాడని, బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించేవాడని ఆమె ఆరోపించింది. బేగంపేట్‌లో తనకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా.. నవాజ్ తమ్ముళ్లు మునవార్, షారుక్, ఇస్మాయిల్‌లు తనపై సామూహిక అత్యాచారానికి (గ్యాంగ్ రేప్) పాల్పడ్డారని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది.

బ్లాక్ మెయిల్.. ఆర్థిక దోపిడీ

తన ఫొటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని నవాజ్ తనను బ్లాక్ మెయిల్ చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే తన తల్లిని, చెల్లిని చంపేస్తానని బెదిరించాడని యువతి వాపోయింది. తన పేరు మీద లోన్లు తీసుకోవడంతో పాటు, తన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదవపెట్టి డబ్బులు కాజేశాడని, శంషాబాద్‌లోని ఓ ఫ్లాట్‌ను సైతం అమ్మేశాడని తెలిపింది. ఈ దారుణాలపై బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు నవాజ్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు పారిపోయాడు. పైగా తాను ఏ తప్పు చేయలేదని, ఆ అమ్మాయే తనను ట్రాప్ చేసిందంటూ కేసును తప్పుదోవ పట్టించేలా ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకే తాను మీడియా ముందుకు వచ్చానని బాధితురాలు స్పష్టం చేసింది.

లవ్ జిహాద్ నిజమే..

‘లవ్ జిహాద్ నిజమే. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. నేను దానికి బాధితురాలిని. నా ఫోటోలు, వీడియోల కోసమే ఇన్నాళ్లు వాళ్ళ బెదిరింపులకు భయపడ్డాను. కానీ నాకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే ధైర్యంగా బయటకు వచ్చి ఈ విషయాలు చెబుతున్నాను.’ అని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది.

Next Story