దానిని చంపేశారు.. కేసీఆర్ జాతీయ పార్టీపై రేవంత్ స్పందన

by Disha Web Desk |
దానిని చంపేశారు.. కేసీఆర్ జాతీయ పార్టీపై రేవంత్ స్పందన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని టీపీసీసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై బుధవారం స్పందించిన ఆయన.. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతమైన కేసీఆర్ భవిష్యత్ లో తెలంగాణ అనే పదం వినిపించకుండా కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని అలాంటి తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కేసీఆర్ లోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలని ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆర్ఎస్ ను తెరపైకి తీసుకువచ్చాడని చెప్పారు.

బీఆర్ఎస్ తర్వాత ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. ఈ విషయాన్ని దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టుకోండి. నేను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటానని అన్నారు. తెలంగాణ, ఏపీ విభఝన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని ఇక తెలంగాణతో కేసీఆర్ కు రుణం తీరిపోయిందని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కేసీఆర్ కు అర్హత లేదని అన్నారు.



Next Story

Most Viewed