రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్.. అన్నదాతల కోసం రాష్ట్రంలో మళ్లీ ఆ స్కీమ్

by Disha Web Desk 13 |
రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్.. అన్నదాతల కోసం రాష్ట్రంలో మళ్లీ  ఆ స్కీమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ప్రకృతి వైపరిత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో 2016 జూన్ నుంచి కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నది. ఈ స్కీమ్ లో భాగంగా రైతులు స్వల్ప మొత్తంలో పంటల ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ పథకం అన్నదాతలకు మేలు కంటే భారమే ఎక్కువ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ స్కీమ్ ను నుంచి 2020లో వైదొలిగింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంట బీమా పథకం అమలు కావడం లేదు. దీంతో ప్రకృతి వైఫరిత్యాల కారణంగా పంట నష్టం జరిగినా రైతులకు ఎలాంటి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా కేసీఆర్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుబందు, రైతుబీమా పథకాలను చూపిస్తూ తాము రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రచారం చేసుకున్నదన్న విమర్శలు ఉన్నాయి. కాగా ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగాక పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సొంతంగా ఓ స్కీమ్ తీసుకువచ్చింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో కొన్ని మార్పులు చేసి బంగ్లా సస్య బీమా యోజన పేరుతో రైతులకు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ తరహాలోనే రాష్ట్రంలో బీమా పథకం అమలు చేస్తామని గతంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసినా ఆచరణలోకి రాలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు:

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన స్కీమ్ లో చేరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. కాగా ఈ స్కీమ్ కింద ఒక్క రైతు బీమా చేయించుకున్న మొత్తంలో కొంత శాతం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ లో ఆహార ధాన్యాలు (వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనెగింజలు)కు సంబంధించి బీమా చేయించుకున్న మొత్తంలో 2 శాతాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వాణిజ్య పంటల కోసం బీమా మొత్తంలో 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే రబీ సీజన్ లో ఆహార ధాన్యాలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభంలో రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేటప్పుడు ఈ పథకంలో చేరాలని కచ్చితమైన నిబంధన నియమించారు. తర్వాత దీనిని ఆప్షనల్ గా మారుస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ స్కీమ్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ బెంగాల్ తరహాలో ఎదైనా మార్పులు చేస్తుందా లేక కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ నే యధావిధిగా అమలు చేస్తుందా ఈ స్కీమ్ విధివిధానాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed