తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

by Disha Web Desk 15 |
తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
X

దిశ, బొంరాస్ పేట్ : ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గం పరిధిలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో కడా ప్రత్యేక అధికారి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాగునీటి సరఫరాపై, బోర్ వెల్స్, చేతి పంపులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోర్ వెల్స్, చేతి పంపులు పనిచేయనట్లయితే శనివారంలోపు మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి (వినియోగంలోకి) వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలకు తాగునీరు అందించడంలో అలసత్వం వహించినట్లయితే చర్యలు తీసుకుంటామని అన్నారు. మిషన్ భగీరథ నీరు అనివార్య కారణాలవల్ల నిలిచిపోయినట్లయితే ప్రత్యామ్నాయంగా నీటిని సమృద్ధిగా అందించే విధంగా కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ, పంచాయతీ అధికారులు సమన్వయంతో మంచినీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తాగునీటికి తప్పని తిప్పలు అనే శీర్షికతో బుధవారం దిశ దినపత్రికలో ప్రచురితం కావడంతో అధికారులు స్పందించినట్లయింది. ఈ సమావేశంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తాండూర్ ఆర్డీవో శ్రీనివాసరావు, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బాబు శ్రీనివాసు, నాగేశ్వరరావు, తహసీల్దార్ విజయ్ కుమార్, మిషన్ భగీరథ ఏఈలు పాల్గొన్నారు.


Next Story