కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : గడ్డం సీతా రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : గడ్డం సీతా రెడ్డి
X

దిశ, శంకర్పల్లి : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గడ్డం సీతా రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శంకరపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో గడీల పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని, ప్రజలందరికి స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు.

గతంలో బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం నేరుగా మంత్రులు ముఖ్యమంత్రులతో కూడా తమ సమస్యలు చెప్పి పరిష్కరించుకునే వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డికి చేయి గుర్తుకు మీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పామేనా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో, మండలాలలో కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అన్ని ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామెన భీమ్ భరత్, పీసీసీ కార్యవర్గ కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు వై ప్రకాష్, మైనారిటీ సెల్ నాయకుడు ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed