నగరంలో అర్థరాత్రి ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షం.. ఆ నేతలతో కీలక భేటీ

by Disha Web Desk 4 |
నగరంలో అర్థరాత్రి ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షం..  ఆ నేతలతో కీలక భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా, ఆ పార్టీ సభ్యుడిగా వ్యవహరించాలనుకుంటున్న ప్రశాంత్ కిషోర్ అకస్మాత్తుగా హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. శనివారం సాయంత్రం పలువురితో చర్చలు జరిపారు. 'మిషన్ కాంగ్రెస్' వ్యూహంలో భాగంగా ఆయన నగరానికి చేరుకున్నారు. ప్రయివేట్ హోటల్ వేదికగా మీటింగ్స్ నిర్వహించారు. సాయంత్రం మొదలైన వరుస భేటీలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోనూ మంతనాలు జరిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి అసంతృప్తికి గురైన ఆ అధికారులతో విడివిడిగానే సమావేశమయ్యారు. ఏయే అంశాలపై చర్చించారనేది గోప్యంగానే ఉంచారు. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత, అసంతృప్తితో ఉన్న ఆ అధికారులతో ముందుగానే మాట్లాడి టైమ్ ఫిక్స్ చేసుకుని చర్చలు జరపడం పలు ఊహాగానాలకు దారితీసింది.

నాయకులతోనూ..

కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పీకే పనిచేయాలనుకోవడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన నగరానికి రావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు, రాష్ట్ర స్థాయి నాయకులతోనూ ఆయన పొద్దుపోయే వరకు సమావేశమయ్యారు. పార్టీకి చెందిన కొద్దిమంది సీనియర్లకు పీకే ముందుగానే సమాచారం ఇచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్‌తోనూ ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ సమావేశం తర్వాతనే కొద్దిమంది అసంతృప్తవాదులను పిలిపించుకుని విడివిడిగా మాట్లాడారు. టీఆర్ఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులతో పాటు రేవంత్‌రెడ్డితో స్వల్ప స్థాయిలో విభేదాలు ఉన్నవారితోనూ ఆయన భేటీ అయ్యారు.

ఊహించని విధంగా..

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో పీకే ఊహించని విధంగా నగరానికి వచ్చి మాజీ బ్యూరోక్రాట్లను, కాంగ్రెస్‌లో అన్యమనస్కంగా ఉన్నవారితో భేటీ కావడం విశేషం. సాయంత్రం నుంచి ఆయన జరిపిన సమావేశాల తీరు చూస్తే టీఆర్ఎస్ వ్యతిరేక స్వభావంతో కూడుకుని ఉన్నట్టుగానే అర్థమవుతున్నది. ప్రశాంత్ కిషోర్‌‌తో కలిసి పనిచేస్తున్నట్టుగా స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పీకే భేటీ కావడం సరికొత్త చర్చకు దారితీసింది. పది మందికి పైగా రిటైర్డ్ బ్యూరోక్రాట్లతో సమావేశం కావడం వెనక స్పష్టమైన వ్యూహమే ఉన్నదన్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది. హైదరాబాద్ వచ్చిన పని టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా చేయాల్సిన కార్యాచరణ కోసమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతానికి పీకే ఏ పార్టీకి పనిచేస్తారన్న విషయంలో వివిధ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన నగరంలో వరుస భేటీలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed