నల్లగొండ జిల్లాకు ఆ పార్టీల అగ్రనేతలు.. పీక్ స్థాయికి చేరిన అభ్యర్థుల ప్రచారం

by Disha Web Desk |
నల్లగొండ జిల్లాకు ఆ పార్టీల అగ్రనేతలు.. పీక్ స్థాయికి చేరిన అభ్యర్థుల ప్రచారం
X

దిశ, నల్లగొండ బ్యూరో : లోక్ సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు, ప్రతివిమర్శలతో దాడి చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో ప్రచారానికి అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ బస్ యాత్ర చేపట్టగా.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నల్లగొండ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ నెల 6న నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. దీనికోసం కమలం నేతలు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో వైపు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నల్లగొండ, చండూరులో జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 3న (రేపు) నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ సెంటర్లో జరిగే సభకు హాజరుకానున్నారు. అదేరోజు చండూరులో నిర్వహించే ప్రచారంలోనూ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు జన సమీకరణకు కసరత్తు చేస్తున్నాయి.

Next Story

Most Viewed