బీజేపీలోకి సర్వే..? అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి

by Disha Web Desk 23 |
బీజేపీలోకి సర్వే..? అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కమలం గూటికి వెళ్లుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సర్వే, బీజేపీ అగ్రనేత` లతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కోసం పలువురు కమలం నేతలతో భేటీ అయినట్లు తెలిసింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన శ్రీ గణేష్ నారాయణన్ ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే.దీంతో సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశిస్తూ హస్తినాలో పైరవీలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సోనియాకు సన్నిహితుడని పేరున్న..

ఉమ్మడి రాష్ట్రంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా, మల్కాజిగిరి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాగా సర్వే సత్యనారాయణ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి, వరంగల్ లోక్ సభ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి టికెట్ ను ఇప్పటికే పట్నం సునీత మహేందర్ రెడ్డి కి కేటాయించగా, వరంగల్ టికెట్ ను కాంగ్రెస్ నేతలు దోమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిరా లలో ఎవరికో ఒకరికి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలికి సన్నిహితుడని పేరున్నప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సర్వే కు సరైన ప్రాధాన్యత దక్కక పోవడం లేదు. ఇటివల పలుమార్లు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని సైతం సర్వే కలిశారు. అయినా పార్టీ నుంచి ఆశించిన ప్రాధాన్యత లభించకపోవడంతో బీజేపీలోకి వెళ్లేందుకు కేంద్ర మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సర్వే బీజేపీలోకి వెళ్లితే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కంటోన్మెంట్ తో అనుబంధం..

సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ నివాసి. 1985లో ఉమ్మడి రాష్ట్రంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో సిద్దిపేట నుంచి ఎంపీగా గెలుపొందారు. సిద్దిపేట (ఎస్సీ రిజర్వుడు) పార్లమెంట్ పరిధిలోనే కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా ఉంది.. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల సిద్దిపేట ఎస్సీ రిజర్వుడు నుంచి మల్కాజిగిరి జనరల్ సీటు గా మారింది. అయినా 2009లో ఆ సీటును కాంగ్రెస్ పార్టీ జనరల్ స్థానాన్ని సర్వే సత్యనారాయణకు కేటాయించింది. రెండోసారి ఎంపీగా గెలుపొందిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న చేతిలో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే కంటోన్మెంట్ లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ కాంగ్రెస్ గూటికి చేరడంతో.. సర్వే సత్యనారాయణను బీజేపీ నుంచి పోటీ చేయాలని సన్నిహితులు ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో గత నాలుగైదు రోజులుగా ఢిల్లీలో ఉండి.. కంటోన్మెంట్ బీజేపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story