మెదక్ ఎంపీగా గెలిచిరా..

by Disha Web Desk 15 |
మెదక్ ఎంపీగా గెలిచిరా..
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి రావాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, వేం నరేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హరగోపాల్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నీలం మధు తీసుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ చౌదరి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ పరిధిలో గ్రౌండ్ అంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ప్రాతినిథ్యం వహించిన మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమన్నారు.

ఇందిర హయాంలోనే మెదక్ పార్లమెంటు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఇక్కడ ప్రజలకు విరివిగా ఉపాధి అవకాశాలు దొరికి ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. గత 25 ఏళ్లుగా రెండు పార్టీల పార్లమెంట్ సభ్యులు మెదక్ కు చేసింది శూన్యమని ప్రజలంతా విశ్వసిస్తున్నారని స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంట్ పై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలనే కసితో క్యాడర్ అంతా పని చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, ఇదే ఊపులో మెదక్ పార్లమెంట్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపు నిచ్చారు.

అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ పేదింటి బిడ్డనైన తనను నమ్మి బీసీ వర్గాలకు ప్రాధాన్యతను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి సమన్వయంతో పనిచేసి ఇందిరమ్మ ప్రాతినిథ్యం వహించిన మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed