దేశంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం స్థానందే

by Disha Web Desk 15 |
దేశంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం స్థానందే
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఈ లోక్​సభ ఎన్నికల్లో యావత్ దేశంలోనే కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘు రాంరెడ్డి సాధిస్తారని ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో నిర్వహించిన జనజాతర సభకు ఆయన ముఖ్యమంత్రిగా హాజరై ప్రసంగించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఖమ్మం స్థానంలో రఘురాం రెడ్డిని నిలిపారని అన్నారు. గతంలో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని, ఇప్పుడు ఖమ్మం స్థానం జాతీయస్థాయిలో అత్యధికంగా మూడు లక్షల మెజారిటీ సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండలోనూ.. తరలివచ్చిన వామపక్ష శ్రేణులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మంకు గొప్ప చరిత్ర ఉందని, చైతన్యవంతమైనదని,

రైతుల హక్కుల మీద ఘనమైన పోరాటాలు చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు మనం సెమీఫైనల్ గా భావించి సక్సెస్ అయ్యామని, ఇక ఫైనల్ పోరు అయిన ఈ లోకసభ ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. గుజరాత్ జట్టుకు నరేంద్రమోదీ కెప్టెన్ అయితే తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ కెప్టెన్ కాబట్టి ఫైనల్ దుమ్మురేపి కప్పు గెలవాలి అన్నారు. అంతటా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రజలపైనే ఉందని, మీ రక్తాన్ని చెమటగా మార్చి ముమ్మర ప్రచారం చేయాలని కోరారు.

రఘురాం రెడ్డి పక్షాన అండగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే మీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయం అనిపిస్తోంది అని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలైందే కొత్తగూడెం నుంచి అంటూ గుర్తు చేశారు. గత ఎన్నికలను పరిశీలిస్తే.. బీఆర్ఎస్ కపట నాటకాలను ఇక్కడి ప్రజలు నమ్మలేదని తెలిపారు.

నామా గెలిస్తే మంత్రి ఎలా అవుతాడు కేసీఆర్..?

బీఆర్ఎస్ నుంచి నామా గెలిస్తే కేంద్ర సంకీర్ణంలో మంత్రి అవుతాడు అని చెప్పిన కేసీఆర్.. బీజేపీ పంచనే ఉన్నావని ఒప్పుకున్నావు కదా అని ప్రశ్నించారు. బోర్లా పడి బొక్కలు విరిగిన కేసీఆర్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి మొత్తానికే పక్కకు నెట్టాలన్నారు.

ఆ రోజుల్లోనే వైఎస్సార్ చెప్పారు..

"ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అయినా.. ఖమ్మం జిల్లాకు మాత్రం ఇక్కడ ఉన్న అందరూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ముఖ్యమంత్రులు.. అని ఆ రోజుల్లోనే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చెప్పేవారని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే ఈ శ్రేణులంటే గౌరవం అని అన్నారు. అంత చైతన్యవంతమైన జిల్లా కాబట్టే కాలకుఠ విషం దాచుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఇప్పటికే ప్రజలు 100 అడుగుల లోతులో పాతి పెట్టారని తెలిపారు. ఎవరితో పెట్టుకున్నా.. ఖమ్మం జిల్లా ప్రజలతో మాత్రం పెట్టుకోకు కేసీఆర్ అంటూ హెచ్చరించారు.

మోసకారి బీజేపీని నమ్మొద్దు..

ఆనాడు..తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు.. తల్లిని చంపి బిడ్డను బతికించారు.. అని బీజేపీ కూసిందని, ఇప్పుడు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కొత్త ఫ్యాక్టరీ లు, రైల్వే కోచ్ లు రాష్ట్రం అడిగితే..కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు.

భద్రాద్రి రాముడి సాక్షిగా చెబుతున్నా.. అన్నీ అమలు చేస్తాం

రైతు భరోసా పథకం ద్వారా 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందని, మిగతా నాలుగు లక్షల రైతులకు త్వరలోనే రైతు భరోసా ఇస్తాం అని, బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినా వాటి వడ్డీలు కట్టుకుంటూ.. అందరికీ పథకాలు వర్తింపజేస్తూ, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని అన్నారు. ఆగస్టు తొమ్మిది లోపు రైతుల రుణమాఫీ అమలు చేసి తీరతామన్నారు. అప్పుడు ముక్కు నేలకు రాస్తావా..? కేసీఆర్ అని సవాల్ విసిరారు. భద్రాచలం రాముడి సాక్షిగా .. అన్నీ అమలు చేసి చూపుతామని అభయమిచ్చారు.

సింగరేణిని కాపాడుకుంటాం : ఉప ముఖ్యమంత్రి భట్టి

కేసీఆర్ పాలనలో సింగరేణి నిర్వీర్యం చేశారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థను కాపాడుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా.. సింగరేణి కార్మికుల కోసం రూ. కోటి బీమా ఫాలసీ తీసుకొచ్చామని ప్రకటించారు. మూసివేసిన థర్మల్ పవర్ స్టేషన్ ని తిరిగి వాడకం లోకి తీసుకొచ్చి, మళ్లీ వెలుగులు నింపుతామన్నారు.

ఎక్కడా కరెంటు కోత లేకుండా సరఫరా చేస్తున్నామని, విపక్షాలు తప్పుడు ప్రచారం ఆపాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తుందని, వాటి రక్షణకు అంతటా కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి..ఆర్థిక క్రమ శిక్షణ కనిపిస్తోందన్నారు. ఖమ్మం ఎంపీగా రఘురాం రెడ్డిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడంలో మన జిల్లా పాత్ర ఉండాలని కోరారు.

ప్రజల ఓట్లే గీటురాయి : మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రాష్ట్ర పాలన ఎంత బాగుందో చెప్పడానికి పార్లమెంట్ ఎన్నికలే రెఫరెండం అని, ప్రజల ఓట్లే గీటు రాయి అని తెలిపారు. ఆంధ్రాలో కలిసిన ఐదు పంచాయతీలు మనం తెచ్చుకోవాలి అంటే కాంగ్రెస్ గెలవాలి అన్నారు. పంట నష్ట పరిహారం కూడా కొద్ది రోజుల్లోనే ఇస్తామన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీవి తెర వెనుక డ్రామా : మంత్రి పొంగులేటి

బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నామా ను గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతాడని కీసీఆర్ చెప్పిన మాటను బట్టి..వారి తెరవెనుక డ్రామా బయట పడిందన్నారు. అప్పుడు సంక్షేమం మరిచి, ఇప్పుడు కర్ర పట్టుకుని జిల్లాకు వచ్చి అబద్ధాలు ఆడుతూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబమైన ఇందిరా గాంధీ మనుమడు రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేసుకుందామన్నారు.

Next Story

Most Viewed