మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యం

by Disha Web Desk 15 |
మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యం
X

దిశ, మధిర : భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మన ప్రధానమంత్రి మోదీ వల్లే అవుతుందని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. గురువారం మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు చెప్పిందే చేస్తుందని , చేసేది మాత్రమే చెబుతుందని, దానికి నిదర్శనమే గత పది సంవత్సరాల్లో మోదీ పరిపాలన అన్నారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో యువత ఎక్కువగా గల దేశం భారతదేశం అని , భారత దేశ అభివృద్ధి మోదీ ధ్యేయమని, అందువలన యువత ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని కోరారు. బీజేపీలో అన్ని వర్గాల, కులాల మతాల వారికి సమన్యాయం దక్కుతుందని, దానికి నిదర్శనమే దేశానికి మొదటి పౌరులుగా బీజేపీ ఆదిమవాసి మహిళ అయిన ద్రౌపతి ముర్మును, మైనారిటీ వర్గానికి చెందిన దివంగత ఏపీజే అబ్దుల్ కలాంను అలాగే దళిత వర్గానికి చెందిన రామనాథ్ కోవింద్ ను

రాష్ట్రపతులుగా నియమించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు నమ్మొద్దని , బీజేపీ మరలా గెలిస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుంది అంటే నమ్మేంత అమాయకులు ఎవరూ లేరని అన్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ ఫలించదన్నారు. రిజర్వేషన్ ఎత్తివేత అనేది బూటకపు వదంతేనని, దీనిని ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలలో భాగంగా మత రాజకీయాలకు తెరలేపుతోందని హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య వర్గ వివాదాలు తలెత్తేలా తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా వెనుకబడి ఉందని ,

ఖమ్మం జిల్లా నుండి బీజేపీ తరఫున ఎంపీ గా పార్లమెంట్లో అడుగు పెడితే మన జిల్లాను మనమే అభివృద్ధి చేసుకుంటామని, ప్రజలు దీనిని గమనించి కమలం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్నర్ మీటింగ్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గెళ్ల సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం, పెరుమాళ్లపల్లి విజయరాజు, సిలివేరు సాంబశివరావు, పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి, జనసేన, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీడియా మద్దతు ఉంటే గెలుపు నాదే

జిల్లాలో మధిర నియోజకవర్గంలో మీడియా మద్దతు తనకు ఉంటే తాను గెలిచినట్లేనని బీజేపీ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు అన్నారు. గురువారం మధిర పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులను కలిసి కార్నర్ మీటింగ్ లో తాండ్ర వినోద్​రావు పాల్గొని ప్రసంగించారు. తనకు అవకాశం

కల్పిస్తే జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం సమీపంలో కవరేజ్ చేస్తున్న మీడియా మిత్రులను చూసిన ఆయన ప్రచార రథం నుండి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వచ్చి చైతన్యవంతమైన మధిర ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వానికి పాలకులకు మధ్య జర్నలిస్టుల పాత్ర గొప్పదని, తనకు మద్దతుగా నిలిచి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed