పొలాల్లో నిప్పు.. పర్యావరణానికి ముప్పు

by Dishafeatures2 |
పొలాల్లో నిప్పు.. పర్యావరణానికి ముప్పు
X

యాసంగి వరి కోతలు ప్రారంభం కాగా, పత్తి పంట కాలం పూర్తయింది. దీంతో రైతులు పంట చేళ్లలో పత్తి కట్టెను తొలగించి వేసవి దుక్కులకు సిద్దం చేస్తున్నారు. అయితే పత్తి కట్టెతోపాటు వరి గడ్డిని పొలాల్లోనే ఉంచి నిప్పంటిస్తున్నారు. దీంతో పంటపొలాల్లో మంటలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. చుట్టు పక్కల పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపిస్తోంది. అంతేకాక చుట్టు పక్కల పొలాల్లోకి మంటలు వ్యాపించి అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పర్యవరణానికి ముప్పు వాటిల్లడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో పత్తి కట్టెలను సేకరించి ఇంటికి తరలించి వంట చెరుకుగా వాడుకునే వారు. అలాగే వరి గడ్డిని పశువులకు మేత కోసం ఉపయోగించే వారు. ప్రస్తుతం గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గడంతో చాలామంది రైతులు గడ్డిని పొలాల్లోనే ఉంచి దగ్ధం చేస్తున్నారు. దీంతో పంట పొలాల్లోని భూసారం తగ్గిపోతుండడంతో పాటు పంట దిగుబడి తగ్గుతోంది. రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. కాగా, రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాధికారులు మాత్రం ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అవగాహన లేక రైతులు పొలాల్లో గడ్డి, పత్తి కట్టెకు నిప్పు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని రైతులకు అవగాహన సదుస్సులు నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

దిశ, కరీంనగర్​ బ్యూరో : యాసంగి వరి కోతలు మొదలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణ తగ్గడంతో వరి కోతలు పూర్తి కాగానే రైతులు పంట పొలాల్లో వరి గడ్డిని కాల్చడం పర్యవరణానికి ముప్పుగా మారుతోంది. వరి గడ్డిని కాల్చడం వల్ల క్లోరో ఫ్లోరో కార్బన్స్ వెలువడుతుంటాయి. రైతులు వరి గడ్డితోపాటు పత్తి కట్టె కాల్చొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల భూ భౌతిక పరిస్థితుల్లో పెను మార్పులు రావడంతోపాటు దిగుబడులుపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పొలాల్లో మంటలు పెట్టొద్దని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రాష్ట్రాల్లోని వ్యవసాయ అధికారులు ఎక్కడ అమలు చేయడం లేదు.

వరి, పత్తి కట్టె కాల్చడంతో...

ప్రస్తుతం యాసంగి వరి పొలాలు కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. వాసకాలంలో సాగు చేసిన పత్తి పంట పూర్తి అయింది. రైతులు వారి పంట చేళ్లలో ఉన్న పత్తి కట్టెలను పొలం నుంచి తొలగించి వేసవి దుక్కులు సిద్దం చేస్తున్నారు. రైతులు పత్తి కట్టెలతోపాటు వరి గడ్డిని కాల్చుడం వల్ల పర్యవరణానికి ముప్పు వాటిల్లడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారు. పత్తి కట్టెలను సేకరించి ఇంటికి తరలించి వంట చెరుకుగా వాడుకునే వారు. వరి గడ్డని రైతులు పశువులకు మేత కోసం ఉపమోగించే వారు. ఎండిన గడ్డిని కుప్పగా పెట్టి పశువులకు మేతగా వాడుకునే వారు. ప్రస్తుతం గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గడంతో చాలా మంది రైతులు వరి గడ్డని పొలం నుంచి తరలించకుండానే పొలాల్లోనే నిప్పు పెట్టి దగ్ధం చేస్తున్నారు. దీంతో ప్రమాదకర స్థాయిలో పొగ వెలువడుతోంది. అంతేకాక చుట్టు పక్కలకు సైతం మంటలు వ్యాపించి అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

క్లోరో ఫ్లోరో కార్బన్స్ విడుదల...

పొలంలోని వరి గడ్డని కాల్చడం వల్ల క్లోరో ఫ్లోరో కార్బన్​ (సీఎఫ్​సీ) విడుదల అవుతుందని పర్యవరణ వేత్తలు అంటున్నారు. క్లోరో ఫ్లోరో కార్బన్​తో పర్యవరణానికి పెనుముప్పుగా భావిస్తున్నారు. వాస్తవానికి వరి పండిస్తున్న ప్రాంతాల్లో మిథేన్​ గ్యాస్​ వెలువడుతుంది. మిధేన్​ గ్యాస్​ వర్యవరణానికి ముప్పుగా భావిస్తున్న నేపథ్యంలో రైతులు వరి గడ్డి, పత్తి కట్టెలు కాల్చడం వల్ల వస్తున్న కాలుష్యంతో మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల పర్యవరణంతోపాటు పంటలపై ప్రభావం చూపుతుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంటున్నారు. పంట పొలాల్లో మంటలు వేయడం వల్ల భూ భౌతిక పరిస్థితులు పూర్తిగా మారి పోయి భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు.

ఆర్థికంగాను నష్టం..

రైతులు అవగాహన లేక వరి గడ్డి, పత్తి, కంది కట్టెలను పంట పొలాల్లో కాల్చడం వల్ల భూసారం తగ్గడంతోపాటు పలువురు రైతులు ఆర్ధికంగా నష్ట పోతున్నారు. ఎండకాలం కావడంతో గడ్డి, పత్తి, కంది కట్టెలు కాల్చుతున్న సమయంలో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ఇలా వ్యాపించిన మంటలతో కరెంట్​ మోటర్లు, వైర్ల, పైప్​లైన్లు కాలిపోతున్నాయి. విలువైన వస్తువులు కాలిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రోడ్ల వెంట వ్యాపిస్తున్న మంటలతో హరితహారంలో నాటిన మొక్కలు సైతం చనిపోతున్నాయి.

అవగాహన సదస్సులేవి..?

పర్యవరణ పరిరక్షణతోపాటు భూ భౌతిక స్థితిగతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో పంట పొలాల్లో మంటలు పెట్టొద్దని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రాల్లోని అగ్రికల్చర్​ ఆఫీసర్లతో అమలు చేయించాలని పేర్కొన్నది. జిల్లాలో ఎక్కడా అగ్రికల్చర్​ ఆఫీసర్లు రైతులకు పంట పొలాల్లో మంటలు పెట్టొద్దని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. రైతులకు అవగాహన లేకపోవడంతో పంట పొలాల్లో మంటలు వేయడం వల్ల అనేక నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా అగ్రికల్చర్​ ఆఫీసర్లు చోరవ తీసుకొని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు పర్యవరణవేత్తలు కోరుతున్నారు.


Next Story

Most Viewed