ఎడారి బతుకులకు భరోసా ఏది?

by Disha Web Desk 12 |
ఎడారి బతుకులకు భరోసా ఏది?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఉన్న ఊరిలో ఉపాధి కరువై బతుకు భారమై కుటుంబ పోషణ కోసం గల్ఫ్ బాట పడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనుకున్న యువతకు నిరాశే ఎదురైంది. ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడంతో ఎడారి దేశాలకు వెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది లేబర్ వీసాలపై విదేశాలకు వెళ్తుంటారు. గల్ఫ్ దేశాలకు వెళితే ఉపాధి దొరకడం మాట అంటుంచుతే అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునే వారు లేకపోవడంతో దేశం కాని దేశంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విదేశాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యుల బాధ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రమాదాల బారిన పడడం లేదా అనారోగ్య సమస్యలతో మృతి చెందితే కనీసం చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు. మృతదేహాలను స్వదేశానికి తెప్పించేందుకు గల్ఫ్ జేఏసీలు, ఎన్నారై స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదనే చెప్పాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుని భరోసా కల్పించాలని గల్ఫ్ కార్మికుల కుటుంబాలు కోరుతున్నారు.

అనుమతులు లేని ఏజెన్సీల మోసం

జగిత్యాల జిల్లా నుంచి ఎక్కువ మంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే వారి అవసరాన్ని అసరగా చేసుకుంటున్న కొంతమంది గల్ఫ్ ఏజెంట్లు అందినకాడికి దోచుకుంటున్నారు. అనుమతులు లేకుండా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో మ్యాన్ పవర్ కంపెనీలు ఏర్పాటుచేసి నిరుద్యోగులను బోల్తా కొట్టిస్తున్నారు. లేని ఉద్యోగాలను క్రియేట్ చేసి విజిట్ వీసాలపై కార్మికులను గల్ఫ్ బాట పట్టించి చేతులు దులుపుకుంటున్నారు. మంచి ఉద్యోగం కదా అని ఏజెంట్లు అడిగినంత డబ్బు ఇచ్చి గల్ఫ్ బాట పట్టిన కార్మికులు తీరా అక్కడికి వెళ్లాక పరిస్థితులు తారుమారు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొవడమే కాక జైలు పాలవుతున్నారు.

స్కిల్ వర్క్ అని చెప్పి పంపించి తీరా వెళ్ళాక పాస్ పోర్టు తీసుకుని బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, ఎడారిలో పని చేయించడం వంటివి చేయిస్తున్నారని బాధితులు సొషల్ మీడియాలో గోడు వెళ్లబోసుకుంటున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు ఏజెంట్ల మోసాలను అరికట్టడంతోపాటు పర్మిషన్లు లేని మాన్ పవర్ కన్సల్టెన్సీ‌లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి.

విదేశీ బాటలో యువత...

జిల్లా నుంచి ప్రతి ఏటా ఉపాధి కోసం విదేశాల బాట పడుతున్న వారిలో యువతనే ఎక్కువగా ఉంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువకులు 18 ఏళ్లు నిండిన వెంటనే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడం, ప్రతి సంవత్సరం అతివృష్టి లేదా అనావృష్టితో వ్యవసాయం కలిసి రాకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం తెలంగాణకు వలస కూలీలు వస్తున్నారని చెబుతున్న ప్రభుత్వం ఇక్కడ యువతకు సరైన ఉపాధి కల్పించి ఎడారి దేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

హామీలకే పరిమితమైన ప్రభుత్వ విధానం..

స్వదేశం తో పాటు విదేశాల్లో ఉన్న కేరళ కార్మికుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలంగాణలో అమలు చేస్తామని ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమైంది. కేరళ నోర్కా రూట్స్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు వారి భద్రత కోసం ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. నాన్ రెసిడెంట్ కేరలైట్స్ కోసం కేరళ ప్రవాసి వెల్ఫేర్ బోర్డును సైతం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా స్వాంతన, కారుణ్యం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం సైతం వలసలను ఆపడానికి ఎన్నారై సెల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేక పోతుందనే చెప్పాలి. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రంలోనూ అమలు చేయాలని గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నాయి.

గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలను మాత్రమే సంప్రదించాలి.

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళేవారు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలి. వీసా ప్రాసెసింగ్ టైంలో అన్ని సరిచూసుకొని ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ పై సంతకం చేయాలి. ఏజెంట్లు లేదా రిక్రూటింగ్ ఏజెన్సీ ఆఫర్ చేసిన జాబ్ డీటెయిల్స్ అన్ని నిర్ధారించుకోవాలి. రెండు నెలల శాలరీ అమౌంట్ మాత్రమే ఏజెన్సీలకు ఇవ్వాల్సి ఉంటుంది . - స్వదేశ్ పరికిపండ్ల, ప్రెసిడెంట్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ తెలంగాణ


Next Story

Most Viewed