కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోంది.. చాడ వెంకట్ రెడ్డి

by Dishafeatures2 |
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోంది.. చాడ వెంకట్ రెడ్డి
X

దిశ, జగిత్యాల టౌన్ :బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు మొండి చేయి చూపి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసినట్లుగా ఉందన్నారు. కూలి పనులు చేసుకుని కడుపు నింపుకునే కూలీల పొట్ట కొట్టేలా కేంద్రం ఈజీఎస్ పథకానికి రూ. 30 వేల 500 కోట్ల బడ్జెట్ తగ్గించడం దుర్మార్గపు చర్య అన్నారు. అదే కార్పొరేట్ సంస్థలకు వరాలు కురిపించి వారి ఉన్నతికి కృషి చేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు, ఉపాధి, విద్య, వైద్యం, కనీస వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం 15 నుంచి 20 ఏళ్లలోపే అదానీ కంపెనీ 14 లక్షల కోట్ల రూపాయలకు ఎదగడం వెనుక కేంద్రం పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. అదానీ షేర్ల విలువ పడిపోవడంతో బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగవేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్ల మేర కార్పొరేట్ సంస్థలకు మొండి బకాయిల పేరిట రుణమాఫీ చేయడం దుర్మార్గమని అన్నారు.

ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయగా బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం కుటిల ప్రయత్నం చేస్తుందన్నారు. అదానీ షేర్ల పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేసి ప్రశ్నించకుండా చేస్తున్నారని, ఐటీ, ఈడీ, సీబీఐలతో కేసులు పెడుతూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్రంలో చాలామందికి నివాస స్థలాలు లేవని, వారందరికీ ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందించాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని కోరారు. రెవెన్యూ కొత్త చట్టం తెచ్చి సర్వే నెంబర్ల వారిగా సమగ్ర సర్వే చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు అన్నారు. వెంటనే సమగ్ర సర్వే చేపట్టాలని, ధరణి లోపాలను, లొసుగులను సరి చేయాలన్నారు. అసలైన నిరుపేదలకే దళిత బంధు ద్వారా ఆర్థిక సాయం అందించాలని, ఈ విషయాలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని వెంకటరెడ్డి కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ఎండి ముక్రం వెన్న సురేష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed