ప్రభుత్వ స్థలమని బోర్డ్ పెట్టినా లెక్క చేయట్లే..?

by Disha Web Desk 11 |
ప్రభుత్వ స్థలమని బోర్డ్ పెట్టినా లెక్క చేయట్లే..?
X

దిశ, మియాపూర్: అక్కడ ప్రభుత్వ స్థలం అని బోర్డు పాతి ఉన్నది. అయితే అక్కడ ఎవరైనా ఆ స్థలాన్ని ఆక్రమించినా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం అని పెద్ద పెద్ద అక్షరాలతో కూడా రాసి ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం అవి కనిపించలేదు. కనిపించినా సదరు వ్యక్తులు రూల్స్ మాకేమీ వర్తించవు అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అదే స్థలాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ టైల్స్ బిజినెస్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం గమనార్హం.


వివరాల్లోకి వెళ్లితే.. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ విశ్వనాథ గార్డెన్ కు ఎదురుగా కొంత ప్రభుత్వ స్థలం ఉంది. అదే చోట ప్రభుత్వ స్థలం అంటూ బోర్డ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది అవి మాకేం పట్టవన్నట్లు, రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన బోర్డ్ ను సైతం ఆక్రమించి మరీ టైల్స్ బిజినెస్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులకు మాత్రం అవి కనిపించక పోవడం దురదృష్టకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి..

ఇటీవల ప్రభుత్వ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ అన్యాక్రాంతం అవుతున్న సంగతి విదితమే. ఏండ్ల తరబడి పాతిన ప్రభుత్వ సూచిక బోర్డులనే ఆనవాళ్లు లేకుండా చేస్తున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు పాతిన ప్రభుత్వ సూచిక బోర్డు, తెల్లవారే సరికి నామ రూపాల్లేకుండా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత అద్వానంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇలా అయితే ప్రభుత్వ స్థలాలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరూ అయితే దర్జాగా కబ్జా చేసి అది ప్రభుత్వ భూమి కాదని నిరూపించేందుకు కూడా వెనకాడడం లేదు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి సారించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed