సిటీలో నిప్పుల వర్షం.. 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

by Disha Web Desk 12 |
సిటీలో నిప్పుల వర్షం.. 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరంపై ప్రఛండ భానుడి ప్రతాపం పెరుగుతుంది. ఈ సారి ఎండలు కాస్త ముందుగానే దంచి కొడుతున్న, మధ్యలో 2, 3 రోజుల పాటు వాతావరణం చల్లబడినట్టే చల్లబడి, సోమవారం వేడి విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో గరిష్ట ఉష్ణోగ్రత 41.4 డిగ్రీలుగా నమోదవడంపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే దంచి కొడుతున్న ఎండల కారణంగా వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుం చి 3 గంటల వరకు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పలుచబడుతుంది. ముషీరాబాద్ చిలకలగూడ, బార్కాస్ చంద్రాయణ గుట్ట ప్రాంతాల్లోనూ 41.3 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ ఆఖరి వారంలో గానీ, మే మొదటి వారంలో గానీ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేవని, ఈ సారి కాస్త ముందుగానే 41.4 డిగ్రీల టెంపరేచర్ నమోదవడంతో, మున్ముందు ఎండలు మరింత దంచి కొడతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 10 ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 8 గంటల నుంచి ఎండ మండిపోవడంతో వాకింగ్, జాగింగ్ కోసం వస్తున్న వారంతా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య తమ వ్యాయామం పూర్తి చేసుకొని, 8 గంటల కల్లా ఇంటికి చేరుతున్నారు. ఇప్పటికే నగరంలో ని దాదాపు అన్ని స్కూళ్లు ఒంటిపూట నడుస్తున్నాయి.

కొన్ని పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఎండాకాలానికి ముందు ఉదయం తీరిగ్గా ఆఫీసులకు బయల్దేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు, ఎండ మండి పోకముందే ఉదయం 9 గంటలకు బయలుదేరి ఎండ బారిన పడకుండా ఆఫీసులకు బయల్దేరుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా ప్రతి చిన్న వ్యాపార సంస్థల్లోనూ ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. కాస్త బడా వ్యాపార సంస్థల్లో ఎయిర్ కండీషన్లను వినియోగిస్తూ వినియోగదారులకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు.

నగరంలో ఎటు చూసినా రోడ్డుకిరువైపులా శీతల పానియాలు విక్రయించే స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఎండ వేడిమి పెరగడంతో నిమ్మకాయ రసం, కొబ్బరి బొండం, పుదీనా జూస్ ఇతర చల్లటి కూల్ డ్రింక్‌లకు క్రమంగా డిమాండ్ పెరుగుతుంది. ఇదిలా ఉండగా, గతంలో జరిగిన కుక్క కాట్ల ఘటనతో ఈ సారి జీహెచ్ఎంసీ కుక్కలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి, ఒక్కో సర్కిల్ పరిధిలో వంద చొప్పున మొత్తం 3పై చిలుకు వాటల్ బాల్‌లను ఏర్పాటు చేశారు.


Next Story