శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ వాళ్లు జాగ్రత్తగా ఉండాలి!.. మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక

by Disha Web Desk 5 |
శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ వాళ్లు జాగ్రత్తగా ఉండాలి!.. మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాకు పట్టిన గతే కాంగ్రెస్ వాళ్లకు కూడా పడుతుందని, కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ వాళ్లు జాగ్రత్తగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారడంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కడియంపై తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోకి వచ్చాక ఏ ఒక్క రోజు ఖాళీగా లేడని, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఉపముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని తెలిపారు. 10 సంవత్సారాల పాటు అనేక పదవులు అనుభవించారని, కడియం ను గెలిపించడానికి కార్యకర్తలు ఎంతగా కష్టపడ్డారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చేటప్పుడు ఆయన వెంట 10 మంది కూడా రాలేదని, ఇప్పుడు ఆయన పోతే 10 మంది పోరని, కానీ నిత్యం విలువల గురించి మాట్లాడటం బందు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కడియం శ్రీహరితో జాగ్రత్తగా ఉండాలని, మాకు పట్టిన గతే కాంగ్రెస్ వాళ్లకు కూడా పడుతుందని హెచ్చరించారు. మీరు లేనప్పుడే స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో మీకు తెలుసని, ఆనాడు టీఆర్ఎస్ చేతిలో మీకు చావు దెబ్బ తగిలిందని గుర్తు చేశారు. బలంగా టీఆర్ఎస్ కోటలోకి మీరు చీడపురుగుల్లా వచ్చి కోటను నాశనం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అలాగే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం పెడుతున్నామని, మీలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు స్టేషన్ ఘన్ పూర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.


Next Story