కాళేశ్వరం లొసుగులు ఫస్ట్ చూపేట్టింది శ్రీధర్ బాబే: సీఎం రేవంత్ రెడ్డి

by GSrikanth |
కాళేశ్వరం లొసుగులు ఫస్ట్ చూపేట్టింది శ్రీధర్ బాబే: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేగాక చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నతో పాటు పలువురు ప్రముఖులు విగ్రహాలు ట్యాంక్ బండ్‌పై పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం ఆయన రవీంద్ర భారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు87వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీవీ అనుచరుడుగా శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానం మంథని నుంచి మొదలైందని గుర్తు చేశారు. స్పీకర్‌గా మంచి సాంప్రదాయం నెలకొల్పారన్నారు. శ్రీపాదరావు వంటి నాయకుడు తెలంగాణలో పుట్టడం అదృష్టమన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని సమర్ధవంతంగా నడిపేవారన్నారు. ఇప్పుడు వారి వారసత్వం తీసుకొని రాజకీయాల్లో ఉన్న అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలాగా చొరవ తీసుకుంటున్నారన్నారు. శ్రీధర్ బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి, మొదటిసారి శ్రీపాద రావు తనయుడుగా గెలిచారన్నారు. ఆ తర్వాత ఆయన ప్రతిభ, పనితనం వలనే శ్రీధర్ బాబు అనేక సార్లు గెలిచి ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. శ్రీధర్ బాబు ఉన్నత విద్యావంతుడు, మేధావి అని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. శ్రీధర్ బాబు అనుమతి లేనిదే తాము అసెంబ్లీలో గొంతు విప్పలేమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం లొసుగులు ఫస్ట్ చూపేట్టింది మంత్రి శ్రీధర్ బాబే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed