సారీ… అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు రావడం కుదరదు

by  |
సారీ… అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు రావడం కుదరదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఆగస్టు 5వ తేదీని నిర్ణయించినా హాజరుకావడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ముందుగానే నిర్ణయించిన ప్రీషెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున ఆ సమావేశానికి హాజరుకావడంలో అసౌకర్యం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. దీనికి తోడు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు కూడా ఉన్నందున అవి పూర్తయిన తర్వాత హాజరు కావడానికి వీలుంటుందని పేర్కొంది. ఇందుకోసం ఆగస్టు 20 తర్వాత సమావేశం ఉండేలా మరో తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసి ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరినప్పటికీ ఆ విషయాన్ని చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి మాత్రం హాజరుకావడం సాధ్యం కాదనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పైగా ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉన్నదని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం.

కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం

కేంద్ర ప్రభుత్వంపై సీఎం నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేసింది. “కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సాంప్రదాయం ఉంది. అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. సమావేశంలో పలువురు ఇదే తీరులో అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొని ఉన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టింది. ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ దుర్మార్గ వైఖరిని ఇకనైనా విడనాడాలి. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది” అని ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తమైనట్లు సీఎంఓ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది.

ఒక్క చుక్క నీటినీ వదులుకోం

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సమావేశంలో ఉమ్మడి అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొని ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పవలసిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యు.పి. సింగ్ రాసిన లేఖపై గురువారం ప్రగతిభవన్ లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం సందర్భంగా పై నిర్ణయాలు వెలువడ్డాయి.

ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపిణీకి సంబందించిన కేసులు, ట్రిబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని ఆ ప్రకటన పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడ్డ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తిచేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించినట్లు తెలిపింది. గోదావరి, కృష్ణా జలాల్లో మన రాష్ట్రం వాటాను ఎట్టి పరిస్థితుల్లో సమగ్రంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని, ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగాలని సమావేశం బలంగా అభిప్రాయపడినట్లు తెలిపింది.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్.కె.జోషి, సీఎంఓ ఉన్నతాధికారులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు మేరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, వెంకటరామారావు, రామకృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సీఈలు నాగేందర్ రావు, నరసింహ, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది రవీందర్ రావు తదితరులు పాల్గొన్న సమావేశం నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించింది.

Next Story