అంతరిక్షంలో భారత్ స్పేస్‎ స్టేషన్.. ఇస్రో కీలక నిర్ణయం..

by Disha Web Desk 3 |
అంతరిక్షంలో భారత్ స్పేస్‎ స్టేషన్.. ఇస్రో కీలక నిర్ణయం..
X

దిశ, ప్రతినిధి: ఇస్రో.. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో అంటే ఒక బ్రాండ్. చంద్రయాన్ సక్సెస్‎తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు చూసేలా భారత శాస్త్ర వేత్తలు చేశారు. అదే విజయం కొనసాగించేందుకు పక్కా ప్లానింగ్‎తో ముందుకు వెళ్తూ సక్సెస్ రేట్‎లో ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

2047 నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ఇస్రో శాస్త్ర వేత్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీవారి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‎లో కొత్తగా మూడవ లాంచ్ పాడ్ నిర్మించండానికి స్థల సేకరణ ఏర్పాట్లలో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. దీంతో పాటుగా సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్ న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఎన్‎జీఆర్ఎల్‎వి 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రోకు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది.

అందులో భాగంగానే 2028 న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ మొదటి టెస్ట్ వెహికల్‎ను ప్రయోగించనున్నారు. 2035 – 47 సంవత్సరం నాటికి ఎన్‎జీఆర్ఎల్‎వి లాంచ్ వెహికల్‎ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఇస్రో‎కి అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. కాగా ఇస్రోకు ఈ ఎన్‎జీఆర్ఎల్‎వి న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ఒక వరంగా మారనుంది.

ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ డిసైన్ తయారు చేసే దానిపై ఇస్రోలో పనిచేస్తున్న పిఎస్ఎల్వీ, జిఎస్ఎల్వి, ఎల్ఎంవీ-3 రాకెట్ వెహికల్స్‎లో నైపుణ్యం కలిగిన పదిమంది శాస్త్ర వేత్తలను న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివకుమార్ కు సహాయ సహకారాలు అందించనున్నారు. ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ విజయవంతంగా పూర్తి అయ్యి ఇస్రోకు అందుబాటులోకి వస్తే.. సుమారు 10 టన్నుల బరువు కలిగినటువంటి ఉపగ్రహాలను సైతం (జిటిఓ) GTO జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి సునాయాసనంగా ఉపగ్రహాలను సైతం ప్రవేశపెట్టగలిగే సత్తా ఇస్రోకి సొంతం అవుతుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్ట అనే సాటిలైట్‎తో ప్రస్థానం మొదలుపెట్టి నేటికి వందల కొద్ది ఉపగ్రహాలను నింగికి పంపి ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడింది. అందులో ప్రధానమైన ఉపగ్రహాలు అంగారక, సూర్య, చంద్ర గ్రహాలపైకి ఉపగ్రహాలను పంపి అక్కడ విజయవంతంగా ప్రయోగాలు చేపట్టి ప్రపంచ దేశాలకు ఇస్రో సత్తా చాటింది.

సూర్య గ్రహంపైకి ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని పంపి చరిత్ర సృష్టించింది. అదేవిధంగా చంద్రయాన్ వన్, చంద్రయాన్ టు ఉపగ్రహాలతో చంద్రునిపై అడుగులు పెట్టి చంద్రునిపై పరిశోధనలు చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. అంతే కాకుండా మంగళయాన్ పేరుతో అంగారక గ్రహంపై కూడా ఉపగ్రహాలను పంపి ఇస్రో తన సత్తా చాటుకుని ప్రపంచ దేశాలు సైతం ఇస్రో వైపు చూసేలా చేసింది. ఈ నేపథ్యంలోనే 2047వ సంవత్సరాన్ని టార్గెట్‎గా ఉంచుకొని ఇస్రో మరెన్నో దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు చేపడుతుంది.



Next Story