ఆ ఆగడాలకు ‘శ్రీచైతన్య’ నిదర్శనం

by  |
ఆ ఆగడాలకు ‘శ్రీచైతన్య’ నిదర్శనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఏ స్థాయిలో దందాలకు పాల్పడుతున్నాయో శ్రీచైతన్య ఆగడాలను చూస్తేనే అర్థమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలనూ ధిక్కరిస్తూ ధీమాతో ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నాయి. 9,10 తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఉన్న నేపథ్యంలో ఇతర క్లాసులకు కూడా ఫీజులు యథేచ్ఛగా వసూలు చేస్తున్నాయి. ఉపాధ్యాయులకు నెల వారీగా ‘వసూళ్ల టార్గెట్’ ఇస్తూ పూర్తిచేసిన వారికి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు జీతాలు కూడా చెల్లిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు చేసే సామర్థ్యాన్ని బట్టి టీచర్లకు జీతాలు ఇచ్చే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. లాక్‌డౌన్‌ రోజుల్లో అవసరమైన మేరకు సిబ్బందిని విధుల్లోకి తీసుకున్న యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసులంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయిస్తూ ఫీజుల పేరుతో డబ్బు గుంజే కార్యక్రమాన్ని చేపట్టింది.

సిటీలోని శ్రీచైతన్య బ్రాంచీల్లో దాదాపు అన్ని బ్రాంచీల్లో వందశాతం ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇతర బ్రాంచ్‌ల్లోనూ టీచర్లకు టార్గెట్లు నిర్ధారిస్తోంది. ఆ బాధ్యతను ఆయా క్లాస్ టీచర్లకే అప్పగించింది. ప్రస్తుతం 9,10 తరగతులను నిర్వహిస్తున్నప్పటికీ, ఎనిమిదో తరగతితో పాటు కింది క్లాసుల విద్యార్థుల నుంచి కూడా వంద శాతం ఫీజులను వసూలు చేస్తోంది. ఫిజికల్ క్లాసులు ప్రారంభమైన తర్వాత లిమిటె‌డ్‌గా తీసుకున్న ఉపాధ్యాయులతో తల్లిదండ్రులను ఫాలో అప్ చేయిస్తోంది.

టీచింగ్ పనులు కాకుండా రికవరీ ఏజెంట్లలాగా కేవలం ఫీజులు వసూళ్లు మాత్రమే చేయిస్తున్నట్టు శ్రీచైతన్య ఉపాధ్యాయులు చెబుతున్నారు. తమకు 50శాతమే జీతాలు చెల్లిస్తున్న యాజమాన్యం విద్యార్థుల నుంచి వంద శాతం వసూలు చేసేంత వరకూ రాజీ పడటం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతి రోజూ స్కూల్‌కు రావడం సాయంత్రం వరకూ తల్లిదండ్రులకు కాల్స్ చేసి ఫీజులు చెల్లించేలా చూడటమే ఇప్పుడు శ్రీచైతన్య టీచర్ల డ్యూటీ.. ఇందుకోసం ఉపాధ్యాయులకు చెల్లిస్తోంది సగం జీతం మాత్రమే..

ఫార్మార్మెన్స్ ఆధారంగా టీచర్లకు రిమార్కులు..

ఫీజులు పూర్తిస్థాయిలో వసూళ్లు కాని బ్రాంచిల్లో ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే ‘శ్రీచైతన్య’ యాజమాన్యం రూపొందించింది. 6-10 తరగతుల వరకూ విద్యార్థుల సంఖ్య, అందులో ఫీజులు చెల్లించని వారి వివరాలతో ఒక అప్లికేషన్ రూపొందించారు. ఈ ఫీజుల్లో నుంచి ఉపాధ్యాయులకు నెల వారీగా టార్గెట్లను నిర్ధారించారు. ఉదాహరణకు జనవరి నెలలో రూ. రెండు లక్షలు వసూలు చేయాల్సిన టీచర్‌కు సంబంధించిన డేటా ఫిబ్రవరి ఒకటిన అప్‌డేట్ చేస్తారు. గత నెలలో వసూళ్లు చేసిన ఫీజుల ఆధారంగా టీచర్లకు గ్రేడింగ్ ఇస్తారు. ఇచ్చిన టార్గెట్‌లో కనీసం 25శాతం వసూలు చేసిన వారికి ‘గుడ్’ ర్యాంకింగ్ కేటాయించారు. ఆ లోపు వసూళ్లు ఉంటే ‘బాగాలేదు’, అసలే వసూళ్లు చేయలేకపోతే టీచర్ పనితీరు ‘అసలు బాగాలేదు’ అని వస్తుంది. దీంతో టీచర్లు మానసికంగా ఒత్తిడికి గురయి చివరకు ఉద్యోగాలను వదులుకుంటున్నారు.

విద్యాబోధన చూసి పనితీరు బేరీజు వేయాల్సిన యాజమాన్యం ఫీజుల వసూళ్లలో తమను అంచనా వేస్తుండటంతో టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం అంచనాకు తగినట్టు ఫీజులు వసూలు చేయలేకపోతే.. వచ్చే 50శాతం జీతాన్ని కూడా హోల్డింగ్‌లో పెడుతున్నారు. దీంతో చివరకు టీచర్ వృత్తిని వదులుకుంటున్నారు. విద్యాసంస్థల్లో ఖాళీ అయిన పోస్టుల కోసం గత ఆదివారం (ఫిబ్రవరి 14న) శ్రీచైతన్య తన 11 బ్రాంచిల్లో ప్రత్యేకంగా వాక్ – ఇంటర్య్యూలు నిర్వహించింది. మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా 6 -8 తరగతుల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నా కార్పొరేట్ యాజమాన్యాలపై ప్రభుత్వం స్పందించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, కార్పొరేట్ ఉపాధ్యాయులు ఆర్థికంగా, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

Next Story

Most Viewed