ఉగ్రవాది డీఎస్పీ అరెస్టు ఇలా జరిగింది..!

by  |
ఉగ్రవాది డీఎస్పీ అరెస్టు ఇలా జరిగింది..!
X

శ్రీనగర్‌ విమానాశ్రయంలోని యాంటీ హైజాకింగ్‌ విభాగ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ ను పోలీసులు పట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. డీఎస్పీ, లాయర్, ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టుకు ముందు షోపియన్‌ పోలీసులు ఒక ఫోన్‌ కాల్‌ ను ట్యాప్‌ చేశారు. ఇందులో హిజ్బుల్‌ స్థానిక కమాండ్‌ నవీద్‌ బాబు సోదరుడు మాట్లాడుతూ, తాను ఒక పోలీసు అధికారితో కలిసి జమ్మూ ట్రిప్‌కు వెళ్లడంపై మాట్లాడాడు. ఈ సంభాషణ విన్న నిఘా వర్గాలు ఆ ఉగ్రవాది సోదరుడు ఎవరో పోలీసు కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నాడని భావించారు.

ఈ నవీద్ బాబు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ కాకముందు జమ్మూకశ్మీర్ స్పెషల్‌ పోలీస్‌ అధికారిగా పనిచేశాడు. 2017లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌లో చేరాడు. దీంతో అతడికి తన కింద పనిచేసిన పోలీసులతో సంబాధాలున్నాయి. ఉగ్రవాదిగా గతేడాది జమ్ములో ఒక రైతు వద్ద నెలన్నరపాటు ఆశ్రయం పొందినట్టు పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు పట్టుబడ్డ మరో ఉగ్రవాది ఇర్ఫాన్‌ అహ్మద్‌ మీర్‌ కు అధికారులతో ఎక్కువగా పరిచయాలు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఉగ్రవాదులతో కూడా మంచి సంబంధాలున్నాయి. ఇతని తండ్రి సైఫ్ మిర్ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సయ్యద్ సలాహుద్దీన్ కు సన్నిహితుడు. అయితే 1990లో జరిగిన ఎన్ కౌంటర్ లో మహ్మద్ సైఫ్ మిర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

ఉగ్రవాదుల టూర్ పక్కా అని నిర్ధారించుకున్న పోలీసులు ఆ మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ఇంతలో డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ వాహనం అక్కడికి వచ్చి ఆగింది. దీంతో తాను డిప్యూటీ ఎస్పీగా కానిస్టేబుల్ తో చెప్పాడు. డీఐజీ అక్కడే ఉన్నారని అనడంతో అధికార దర్పం విడిచి ఆయనను కలిశాడు. ఉగ్రవాదులతో వచ్చిన దవీందర్‌ సింగ్‌ ని చూసి మండిపడ్డ డీఐజీ ఆగ్రహంతో చేయికూడా చేసుకున్నారు. వెంటనే పోలీసులు ఆ ఉగ్రవాదులను గుర్తించి ఇంటరాగేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కూడా పోలీసులతో దవీందర్ అబద్దాలు చెప్పారు. తాను ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో భాగంగా వారిని తీసుకెళ్తున్నట్టు వారితో అన్నారు. దానిని అబద్దమని తేల్చిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ఉగ్రవాదులకు దవీందర్‌ సాయం చేస్తూ కశ్మీరీలను హింసిస్తున్నారని 2001లోనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లోనే ఆయనను అరెస్టు చేయాల్సి ఉండగా, ఎఓజీ డీఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్ కశ్మీర్ ఇన్ స్పెక్టర్ గా డిమోషన్ ఇచ్చి, హెచ్చరించి బదిలీ చేశారు. అక్కడ దవీందర్‌ ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. ఆయన విచారణ విధానంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్‌ తన పుస్తకంలో తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌ దాడి ఉగ్రవాది అఫ్జల్ గురుని ఆ దాడికి కొన్ని నెలల ముందు మరో కేసులో దవీందర్‌ అరెస్టు చేశారు.

అప్పుడు అఫ్జల్‌ గురును తీవ్రంగా హింసించారు. ఈ విషయాన్ని దవీందరే స్వయంగా వెల్లడించారు. పార్లమెంటు దాడి విచారణ సమయంలో ఉగ్రవాదులకు దవీందర్ సూచనతోనే సహాయసహకారాలు అందజేసినట్టు అఫ్జల్ గురి వెల్లడించాడు. అందులో దవీందర్ పాత్రను వెల్లడిస్తూ, దాడి జరగడానికి కొద్ది రోజుల ముందు దవీందర్‌ సన్నిహితుడైన అల్తాఫ్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి తనను దవీందర్ వద్దకు తీసుకెళ్లినట్టు తెలిపాడు. మహ్మద్‌ (పార్లమెంట్‌ దాడిలో ఒక నిందితుడు, జైషే ఉగ్రవాది) అనే పాకిస్థాన్‌ వ్యక్తిని తనతో పాటు ఢిల్లీ తీసుకెళ్లి అద్దె ఇంట్లో ఉంచాలని దవీందర్ ఆదేశించాడని తెలిపాడు. అంతే కాకుండా ఆ ఉగ్రవాదికి తెల్లని అంబాసిడర్ కారును కూడా కొనివ్వాలని దవీందర్ ఆదేశించాడు. అతను చెప్పినట్టే వారిని అద్దె ఇంట్లో ఉంచి, కారు కొనిచ్చానని తెలిపాడు. ఆ కారే పార్లమెంటు దాడిలో వినియోగించింది. అయితే ఆధారాలు లేకపోవడంతో దవీందర్ అప్పట్లో అరెస్టు నుంచి తప్పించుకున్నాడు.

Next Story

Most Viewed