పౌరసత్వమే కాదు.. అంతకు మించి

by  |
పౌరసత్వమే కాదు.. అంతకు మించి
X

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చి భారత్‌లో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న ఆ దేశాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని కల్పించడమే ‘సీఏఏ’(పౌరసత్వ సవరణ చట్టం) ఉద్దేశం. సీఏఏ, ఎన్నార్సీ ఆందోళనలు మిన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో శరణార్థులు ఏం కోరుకుంటున్నారు?. వారి మనసుల్లో ఏముంది? ఎలాంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా వారిని భారతీయులుగా మార్చే అవకాశముంటుంది? అన్న వివరాలను శరణార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే…

‘పౌరసత్వం కల్పించడమే కాదు.. మా గౌరవానికి భంగం కలిగించకూడదని’ పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన హిందూ శరణార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉత్తర ఢిల్లీ, అరుణానగర్ కాలనీలోని చిన్న ప్రాంతంలో దాదాపు 170 శరణార్థుల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇక్కడికి అరకిలోమీటరు దూరంలోనే టిబెటియన్ శరణార్థుల కాలనీ ఉంది. ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జి వైపున 150 వరకు పాకిస్థానీ శరణార్థుల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా పలు రకాల దుకాణాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ‘భారత్‌లో గౌరవప్రదంగా బతకాలన్నదే వీరందరి కల’. ఈ శరణార్థుల కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ.. ఎవరిని కదిలించినా భావోద్వేగపూరిత మాటలే వినిపిస్తాయి.

ఈ విషయంపై పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నుంచి భారత్‌కు వచ్చిన ‘దయాల్ దాస్’ అనే వ్యక్తి పలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఎప్పుడైనా భారత్ నుంచి వెళ్లగొట్టే అవకాశముందని తెలిసినా.. తను మాత్రం ‘ఎవరు పాకిస్థానీ? నేను ఇండియన్‌’ అంటూ సగర్వంగా తెలపడం విశేషం. డిసెంబర్ 9న భారత్‌లోనే తనకు కూతురు పుట్టడంతో ఆమె చట్టబద్దంగా భారత పౌరురాలైంది. అయినా తన తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ దేశం నుంచి వెళ్లగొట్టబడే ముప్పును పొంచివుండటం దురదృష్టకరం. ‘సీఏఏ’ అంశం తెరమీదికి వచ్చినప్పటి నుంచి ఈ చట్టం అమలు సంబంధించి ఈ ప్రాంతనివాసులు ఎన్నో హామీలు పొందారు. అయితే ఇప్పటివరకు ఎవరూ కూడా సదరు పౌరసత్వ పత్రాన్ని పొందే ప్రక్రియను గూర్చి వివరించకపోవడంతో వారంతా ఒకింత ఆందోళనలో ఉన్నారు.

పాకిస్థాన్‌ నుంచి వచ్చిన హిందువులు భారత పౌరసత్వం పొందేందుకు 1 డిసెంబర్ 2014కు ముందే వచ్చి ఉండాలనే అర్హతా ప్రమాణాలున్నాయని తెలుస్తున్నా కూడా సీఏఏ హామీతో.. తమ జీవితాల్లో మార్పు వస్తుందన్న ఆశాభావంతో చాలా మంది శరణార్థులు బార్డర్ దాటి భారత్‌లో అడుగుపెడుతున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన చంద్రమ్మ అనే మహిళ.. అక్కడ ప్లస్ 2 చదివింది. తనతో పాటే చదివిన ముస్లిం స్నేహితులకు వొకేషనల్ ట్రైనింగ్‌కు అవకాశం లభించగా.. తనకు మాత్రం రోజువారీ కూలీగానే ఉపాధి లభించింది. ఇవికాక బట్టలు ఉతకడం, రోడ్లు ఊడ్చడం, పారిశుధ్య పనులు.. అక్కడి మైనారిటీలు ఇలాంటి ఉపాధిని మాత్రమే పొందగలదు. కేవలం పేదరికం లేదా మతహింస నుంచి తప్పించుకునేందుకు ఇక్కడకు రాలేదని.. కనీసం దసరా, దీపావళి, హోలి వంటి పండగల గురించి తమకు తెలియదని, హిందీ భాష కూడా పూర్తిగా రాదని చంద్రమ్మ అనే శరణార్థ మహిళ వాపోయింది.

తన పిల్లలు ఇక్కడే చదువుకుని హిందీ మాట్లాడటం, రాయడం, చదవడం నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆమె కోరుకుంటోంది. అంతేకాకుండా పాకిస్థాన్‌లో తమని ఎవరూ బాధపెట్టలేదని, దాడులు చేయలేదని..కానీ అక్కడ తమకు గౌరవం దక్కడం లేదనేది వారి వాదన. భారత్‌లో ఉంటున్న శరణార్థుల కుటుంబాలకు ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. ఒకేగదితో కూడిన ఇండ్లు, అన్ని కుటుంబాలకు కలిపి ఒకే వరసన ప్లాస్టిక్ పోర్టబుల్ టాయిలెట్లు, పైకప్పులు లేని గదులు, తాగునీరు, వైద్యసేవల లేమితో కొట్టుమిట్టాడుతున్నారు. ఓటు హక్కు లేకపోవడంతో వీరికి ఏ రాజకీయ నాయకులు సహాయం చేయకపోవడంతో పలు ఎన్జీవో సంస్థలు మౌలిక వసతుల కల్పనకు శ్రమిస్తున్నాయి. కేవలం కాగితాలపై స్టాంప్ రూపంలో వచ్చే పౌరసత్వాన్ని వీరు కోవడం లేదు. పాకిస్థానీలు అనే ముద్రను చెరిపేసి..భారత్‌లో విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించి భారతీయులుగా గుర్తించాలనేది వారి అభిమతం.



Next Story

Most Viewed