గొంతెండుతోంది..

by  |
గొంతెండుతోంది..
X

భానుడి ప్రతాపానికి భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ఓవైపు తాగునీరు దొరక్క, వ్యవసాయ బావుల నుంచి నీరందక ఇటు ప్రజలు, అటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకుడు గుంతలు, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంతగిరి పోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లోకి గోదావరి జలాలు వచ్చి చేరుతున్నా ఫలితం కనబడటం లేదు.

దిశ, మెదక్: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఎండలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు, ప్రజలు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా వర్షాధారంపై ఆధారపడి కూరగాయలు, మొక్కుజొన్న, మామిడి పంటలు సాగు చేస్తారు. భూగర్భజలాలపై ఆధారపడి ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమార 4 లక్షల ఎకరాల్లో పండ్లు, కూరగాయల పంటలు సాగయ్యాయి. ఇందులో మామిడి, బత్తాయి, బొప్పాయిలతో పాటు కూరగాయలు సైతం సాగు చేశారు. ఈ ఏడాది ఎండలు ఆరంభం స్వల్పంగా ఉన్నా మే నేలలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరి కోతలు పూర్తి కాగా, కూరగాయలు, పండ్లు తోటలు ఇప్పుడిప్పుడే చేతికోస్తున్నాయి. ఈ దశలో ఎండలు తీవ్ర తరం కావటంతో పంటలు ఎండుతున్నాయి. సాధారణంగా గత వర్షకాలంలో కురవాల్సిన దానికన్నా 41 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఫలింగా భూగర్భ జలాలు 28.61 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవి కాలంలో ఎండలు ఎక్కువ కావటంతో భూగర్భజలాలు మరింత తగ్గిపోయాయి.

బోరు బావులు సైతం..

రైతులు పంటలను రక్షించుకోవటం కోసం బోరు బావులను తవ్విస్తున్నారు. ఒక్కో బోరుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండటం లేదు. ఒక్క గ్రామంలో రైతులు ఒక్కటి రెండు మాసాల్లోపు బోర్లు వేశారు. మొత్తంగా వాటి విలువ రూ.కోటి వరకు ఉండటం గమనార్హం. నారాయణఖేడ్, జహీరాబాద్ మండలాల పరిధిలో సుమారు 200 ఎకరాల్లో మామిడి, కూరగాయలు సాగుచేశారు. ఇక్కడ సుమారు 1500 అడుగుల లోతు బోర్లు వేసినా ఫలితం కనిపించడం లేదు.

జిల్లాలో భూగర్భజలశాఖ నివేదిక ప్రకారం సగటున మీటరు నుంచి 3మీటర్ల లోతుకు భూగర్భజలాలు తగ్గాయి. అత్యధికంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మండలాల్లో నీరు ఇంకిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి మట్టాలు కూడా నెల నెలకు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా‌లోని నారయణఖేడ్‌లో 14.114 మీటర్లు, జహీరాబాద్‌లో, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 18.91మీటర్లు, తూప్రాన్‌లో 13.59 మీటర్లు, సిద్దిపేట జిల్లా మర్కుక్‌లో 18.82 మీటర్లు, దౌలతాబాద్‌లో 11.288 మీటర్లు, దుబ్బాక‌లో 12.024 మీటర్ల మేర లోతుకు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్, తూప్రాన్, చిన్నాకోడురు మండలం చంద్లపూర్, హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంత మేరకు అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు.

ఫలించని నీటి సంరక్షణ చర్యలు

భూగర్భ జాలలను పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి రూ.కోట్లు ఖర్చు చేసింది. మిషన్ భగీరథ కింద చెరువుల్లో పూడిక తీయించి లోతు పెంచింది. ఇంకుడుగుంతలు తవ్వించింది. అయినా భూగర్భజలాల తగ్గుదలను పెద్దగా నిరోధించలేకపోయింది. ఇంకుడు గుంతలు తవ్వి నీటిని పెంచుదామనుకున్నా ఆ గుంతలు కేవలం లెక్కలకే పరిమితమయ్యాయి.

గోదావరి జలాలున్నా శూన్యమే..

కాళేశ్వరం ప్రాజెక్టు‌లో భాగంగా జిల్లాలో నిర్మించిన అంతగిరి పోచమ్మ, రంగనాయక‌సాగర్ ప్రాజెక్ట్, కొండ పోచమ్మ, కొమురవెల్లి మల్లన్న‌సాగర్‌‌కు గోదారి జలాలు వచ్చి చేరుతున్నాయి. కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలను నీటితో నింపుతున్నా ఫలితం కనబడటం లేదు. ప్రాజెక్ట్ లో నీళ్లు చేరిన తర్వాత సుమారు వంద రోజులు తర్వాతే భూగర్భజలాలు కొంత పెరుగుతాయని భూగర్భజల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Next Story

Most Viewed