చట్టాలు రద్దు ఆనందమే .. ధాన్యం కొనుగోలుపై పోరాటం ఆగదు : నిరంజన్ రెడ్డి

by  |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలుపై పోరాటం ఆగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతుల విజయమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో మృతి చెందిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ముందే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవని అన్నారు. ఏడాదిన్నర తర్వాత రైతులు ఎదురు చూసిన ఫలితం దక్కిందని అన్నారు. అమరులైన రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకోవాలని కోరారు.

రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోందని భావించిందని తెలిపారు. గత నెల రోజుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై పోరాటం చేస్తోందని, తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఏంటో మోడీకి తెలుసని వెల్లడించారు. మహాధర్నా సంకేతాలు మోడీ ప్రభుత్వం గ్రహించిందని, దక్షిణాది రాష్ట్రాల ఉద్యమానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తారని గ్రహించే.. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందని వెల్లడించారు. రైతులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పడం ఆయన గొప్ప మనసును నిదర్శమని ఒప్పుకుంటున్నట్టు తెలిపారు. కేంద్రం వ్యవసాయాన్ని ఆదరించకపోవడంతోనే ఈ సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విధి నిర్వహణకు దేశంలో ఓ పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ రంగ నిపుణులు ఉన్నారని.. వారితో చర్చించి ప్రణాళిక రూపొందించి రైతాంగానికి దారి చూపాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. వ్యవసాయ భూములను కాలనీలుగా విభజించి ప్రోత్సహించాలని కోరారు. యాంత్రీకరణతో పాటు పోషకాలు అందించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ జాకీలు పెట్టి లేపినా పైకి లేవదని ఎద్దేవ చేశారు. రైతాంగ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం శూన్యమని అన్నారు. నల్ల రైతు చట్టాలకు పురుడు పోసిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. దీంతో ఆ చట్టాలను పెంచిపోషించింది బీజేపీ అని మండిపడ్డారు. దేశంలో వస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. శాంతకుమారి కమిటీ నివేదికలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

దేశంలో ఆహార ఉత్పత్తులను రెగ్యులేట్ చేయడం కేంద్రానికి చేతకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. కార్పొరేట్ రంగాలపై ఎక్కువ మక్కువ చూపడం వల్లే నేడు ఈ సంక్షోభం వచ్చిందని మండిపడ్డారు. 6 లక్షల కోట్లు బ్యాంక్‌లకు కార్పొరేట్లు ఎగ్గోడితే కేంద్రం మాఫీ చెయ్యలేదా? అని ప్రశ్నించారు. పంటలు వేయొద్దు అంటే ప్రజలు ఉపాధి కోల్పోయేందుకు మొదటి అడుగు వేసినట్టే అని, పంట కొనుగోళ్లను ఆర్థికకోణంలో చూడొద్దని అన్నారు. సామాజిక కోణంలో చూడాలని కోరారు. కేంద్రానికి ప్రత్యామ్నాయ ఆలోచన చేయడం చేతకాకపోతే వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని సూచించారు.

Next Story

Most Viewed